YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు సైతం ఆమోదం తెలిపింది అసెంబ్లీ. పట్టణానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్లు, నగరానికి సంబంధించి మేయర్లు, ఇక జిల్లా పరిషత్ చైర్మన్లు ఇలా అన్ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే జరుగుతాయి. అయితే దీనిని అనుకూలంగా మార్చుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 28 జిల్లాల్లో కొన్ని కీలక జిల్లాలను టార్గెట్ చేసుకుంటోంది. ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ జిల్లా పరిషత్ ను కైవసం చేసుకోవడం ద్వారా కూటమికి గట్టి సవాల్ విసరాలని చూస్తోంది. ప్రధానంగా బొత్స ఫ్యామిలీ సెంటిమెంటును ఇక్కడ ప్రయోగించాలని భావిస్తోంది.
* జిల్లాలో బొత్స హవా..
విజయనగరం జిల్లా అంటేనే బొత్స హవా నడుస్తూ ఉంటుంది. ఒక సాధారణ పిఎసిఎస్ అధ్యక్షుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బొత్స.. అనతి కాలంలోనే రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. ఆ కుటుంబాన్ని మొత్తం విజయనగరం జిల్లాలో దించేశారు. అయితే ఆ కుటుంబానికి ఇంతలా కలిసి రావడానికి కారణం జిల్లా పరిషత్. గతంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా బొత్స సతిమణి ఝాన్సీ లక్ష్మి వ్యవహరించారు. తాజాగా ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. అందుకే ఈసారి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జిల్లా పరిషత్ ను కైవసం చేసుకుని తమ కుటుంబ పట్టు పోలేదని నిరూపించుకోవాలని చూస్తున్నారు బొత్స.
* సడలిన పట్టు..
2004 నుంచి విజయనగరం జిల్లా పై తన ముద్ర చాటుకుంటూ వస్తున్నారు బొత్స. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తన బంధువులు, అనుచరులను రంగంలోకి దించుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయన పాచిక పనిచేయలేదు. దాదాపు అందరూ ఓడిపోయారు. విశాఖ ఎంపీగా పోటీ చేసిన భార్య ఝాన్సీ లక్ష్మి సైతం ఓటమి చవిచూశారు. క్రమేపి విజయనగరం జిల్లా పై కూటమి పట్టు పెంచుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ పట్టు పెంచుకోవాలంటే జిల్లా పరిషత్ ను గెలుచుకోవాలని చూస్తోంది ఆ ఫ్యామిలీ. దీనికి ప్రత్యక్ష ఎన్నికలు కలిసి వచ్చేలా ఉన్నాయి. అందుకే బొత్స సత్యనారాయణ సంచలన ప్రకటన చేశారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా తన కుమార్తె డాక్టర్ అనూష రంగంలోకి దిగుతారని ప్రకటించారు. ఇది నిజంగా విజయనగరం పై వైసీపీ కర్చీఫ్ వేయడమే. మరి టిడిపి కూటమి ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.