YS Sharmila: కాంగ్రెస్ గెలుపు కంటే.. వైసిపి ఓటమిని షర్మిల ఎక్కువగా కోరుకుంటున్నారు. అందుకే వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అటు వైసీపీ సైతం అదే అనుమానాలను వ్యక్తం చేస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి.. దక్కకపోయేసరికి రెబెల్ గా పోటీ చేస్తున్న ఓ నేతకు నేరుగా షర్మిల ఫోన్ చేశారు. కొన్ని రకాల కామెంట్స్ చేశారు. షర్మిల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
పాడేరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుల్లి బాబుకు ఆ పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. కానీ అప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా వంతల సుబ్బారావు పేరును హై కమాండ్ ఖరారు చేసింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలోకి రావడంతో వంతల సుబ్బారావును పక్కనపెట్టి బుల్లి బాబుకు టికెట్ కేటాయించారు. ఈ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేసిన వంతల సుబ్బారావు ఇండిపెండెంట్ గా పోటీలోకి వెళ్లారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలి అంతిమంగా వైసీపీకి ప్రయోజనం చేకూరుతుందని భావించిన షర్మిల రంగంలోకి దిగారు. వంతల సుబ్బారావుతో ఆమె రాయబారం నడిపారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
మీరు సొంత మనిషి అంటూ వంతల సుబ్బారావునుకూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకోసారి చూద్దాం అంటూ బ్రతిమిలాడారు. దీనిపై వంతల సుబ్బారావు ఘాటుగా స్పందించారు. ఏనాడు జండా మోయని వ్యక్తికి టికెట్ ఇవ్వడం తనను బాధించిందని.. తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా వేలాదిమంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ తో పాటు వైసిపి ఓటు బ్యాంకు కలిసి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల చెప్పుకొచ్చారు. అటువంటప్పుడు తొలుత నన్ను ఎందుకు అభ్యర్థిగా ప్రకటించారని.. నా రాజకీయ జీవితం నాశనం అయ్యిందని షర్మిలకు వంతల సుబ్బారావు తెలిపారు. ఎంత నచ్చ చెప్పినప్పటికీ వంతల సుబ్బారావు వినిపించుకోలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కాంగ్రెస్ గురించి మరిచిపోవాలంటూ షర్మిల గట్టిగానే చెప్పారు. అయితే మంచిది అంటూ సుబ్బారావు సైతం షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ ఆడియో క్లిప్ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగు చూస్తుండడంతో.. వంతల సుబ్బారావు పైనే అందరి అనుమానం ఉంది. ఆయన వెనుక వైసీపీ ఉందన్న అనుమానం కాంగ్రెస్ పార్టీలో వ్యక్తం అవుతోంది.