YCP Mass Raging on AP Govt : నీకు 15 వేలు.. నీకు 18 వేలు.. నీకు 15 వేలు.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే మాటలు.. ఇదే సెటైరికల్ డైలాగులు. చివరకు వినాయక చవితి వేడుకల్లో కూడా ఇవే పాటలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారంలో.. చిన్నారులు, మహిళలను ఉద్దేశించి మన ప్రభుత్వం వస్తే నీకు 15 వేలు.. నీకు 18 వేలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతున్నా.. సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. దీనినే వైసీపీ హైలెట్ చేస్తోంది.పిఠాపురంలో వరద బాధితులను పరామర్శించిన మాజీ సీఎం జగన్ సైతం ఇలానే మాస్ ఈవ్ టీజింగ్ చేశారు. వినాయక చవితి వేడుకల్లో ఏర్పాటు చేసిన ఓ డ్యాన్స్ కార్యక్రమంలో కూడా ఇలానే ఒక వ్యక్తి టీజింగ్ చేస్తూ పాట పాడారు. సోషల్ మీడియాలో అదే సర్క్యులేట్ అవుతోంది. వైసీపీ శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి.
* అప్పట్లో జగన్ సతీమణి
2019 ఎన్నికలకు ముందు జగన్ భార్య భారతి ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సమయంలో పిల్లల చదువు కోసం ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతి అక్కడ ఉన్న చిన్నారులను ఉద్దేశించి.. నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ చెప్పుకొచ్చారు. చిన్నారులను చూపించి మరీ ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక పిల్లాడికి అమ్మఒడిని వర్తింపజేశారు. అప్పట్లో విపక్షాలుగా ఉన్న టిడిపి, జనసేన విపరీతంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అదే పనిని వైసిపి చేస్తోంది.
* ఇప్పుడు రామానాయుడు
వాస్తవానికి నిమ్మల రామానాయుడు మంచి వర్కర్. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యాక్టివ్ గా పని చేసేవారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాలో హైలెట్ అయ్యేవారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లారు. అందులో భాగంగా ఓ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసే క్రమంలో.. నీకు 15 వేలు.. నీకు 18 వేలు.. నీకు 15 వేలు అన్న డైలాగ్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. టిడిపి సంక్షేమ పథకాలను హైలెట్ చేసింది. ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు ఆలస్యం కావడంతో వైసిపికి ప్రచార అస్త్రంగా మారింది.
* వినాయక చవితి వేడుకల్లో హైలెట్
ఎన్నికల ప్రచారంలో ఈ డైలాగ్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో… ఇప్పుడు వైసిపి ప్రచారం సైతం అదే మాదిరిగా ఉంది. ప్రస్తుతం వినాయక చవితి వేడుకలు జరుగుతుండడంతో.. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఓచోట వేదికపై నుంచి ఓ వ్యక్తి నీకు 15 వేలు.. అంటూ చేసిన వ్యాఖ్యానాలు బాగా హైలైట్ అయ్యాయి. దీంతో వైసీపీ నేతలు సైతం దానిని సర్క్యులేట్ చేస్తున్నారు. మరోచోట వినాయక చవితి వేడుకల్లో రావాలి జగన్.. కావాలి జగన్ అని పాటలతో హోరెత్తించారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి వైసిపి ఈ ప్రయత్నం చేస్తోందని అనుమానాలు ఉన్నాయి. ఎక్కడికక్కడే టిడిపి నేతలు ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేయడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More