Talliki Vandanam: ఏపీలో మరో ప్రతిష్టాత్మక పధకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. రేపు లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయనుంది. తొలి విడత నిధుల విడుదల చేసే అర్హుల జాబితాను గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మరోవైపు ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. కొత్తగా పాఠశాలల్లో చేరిన వారికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత నిధులు జమ చేస్తారు. మరో 24 గంటల్లో అమలు కానుండడంతో ప్రభుత్వం పూర్తి కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రకటించనున్నారు.
* ఎంతమంది ఉంటే అందరికీ..
తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత విద్యా సంవత్సరంలో సాయం చేశారు. ఈ ఏడాది మరోసారి సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13 వేల రూపాయల చొప్పున జమ కానున్నాయి. ఇందుకుగాను పదివేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
* సచివాలయాల వారిగా జాబితా..
రేపు అర్హుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. అంతకుముందే సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించనున్నారు. మరోవైపు వివిధ కారణాలతో నిధులు జమ కాని వారు గ్రీవెన్స్ కు వెళ్ళవచ్చు. ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే ఆగస్టు మూడు లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 4 నుంచి 10 వరకు అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. అర్హుల జాబితాను తయారు చేస్తారు. ఆగస్టు 25 లోగా కొత్తగా ఒకటో తరగతి, ఇంటర్ తొలి సంవత్సరంలో చేరిన విద్యార్థుల వివరాల నమోదుకు తుది గడువుగా ఫిక్స్ చేశారు. ఆగస్టు 30న కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారుల జాబితా విడుదల చేయడంతో పాటు అదే రోజు వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా నిర్వహించనుంది.




