YS Sharmila : వైయస్ షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. జగన్ తో పాటు వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు.వైయస్ కుటుంబ ఆస్తి వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై షర్మిల ఒంటరి పోరాటం చేస్తుండగా..వైసీపీ నుంచి మాత్రం నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. అయినా సరే షర్మిల ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.తనకు జగన్ అన్యాయం చేశారని..వైసిపి నేతలు ఎందుకు తెలుసుకోవడం లేదని..తనపై ఎందుకు పడ్డారని ఆమె ప్రశ్నిస్తున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమె బాబాయి వైవి సుబ్బారెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి వై వి సుబ్బారెడ్డి గా అభివర్ణించారు. బాబాయ్ మీ కళ్ళేదుటే మా పిల్లలు పెరిగారు. వారికి అన్యాయం చేయాలని ఎలా అనిపించింది అంటూ ప్రశ్నించారు. అన్ని విషయాలు తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడడం ఏంటని నిలదీశారు. షర్మిల ఆరోపణల నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమె ఈరోజు స్పందించారు. వై వి సుబ్బారెడ్డి తీరును ఎండగట్టారు. వైసిపి హయాంలో సుబ్బారెడ్డి తో పాటు ఆయన కుమారుడు ఆర్థికంగా లబ్ధి పొందాలని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పక్కన ఉంటారు కనుక లేఖలో మీ ప్రస్తావన తెచ్చానని వైవి సుబ్బారెడ్డి కి తేల్చి చెప్పారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తన నలుగురు మనవల్లకు ఆస్తిలో సమాన హక్కు ఉండాలని భావించారని..ఈ విషయం వైవి సుబ్బారెడ్డి కి సైతం తెలుసని చెప్పుకొచ్చారు. నేను చెబుతున్నది ముమ్మాటికీ వాస్తవమని.. దానిపై ప్రమాణం చేసేందుకు సైతం తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. సుబ్బారెడ్డి చెబుతున్న మాటలు నిజమని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. తాను ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని.. మీరు కూడా ప్రమాణానికి సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. నాకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఏవో చెబితే ఎలా అని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు కంపెనీలకు మీ పేర్లు పెట్టుకున్నారని.. తాను అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం వల్లే నీ పేర్లు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు షర్మిల..
* ఆ ఒప్పంద పత్రం బయట పెట్టలేదు
తమ మధ్య ఆస్తుల పంపకాల ఒప్పందం కూడా జరిగిందని గుర్తు చేశారు షర్మిల. దానికి అనుగుణంగా ఆస్తుల పంపకాలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. సొంత తల్లి పై కేసులు పెట్టిన జగన్ ఒక నాయకుడేనా? ఆయన నిజంగా శాడిస్ట్ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు షర్మిల. అయితే అన్ని తెలిసి వైవి సుబ్బారెడ్డి బాబాయ్ అలా మాట్లాడడం బాధగా ఉందని కన్నీటి పర్యంతం అయ్యారు. తన సోదరుడి కోసం తనతో పాటు తన తల్లి ఎంతగానో కష్టపడ్డారో వైవి సుబ్బారెడ్డి కి తెలియదా అని ప్రశ్నించారు. కుటుంబ ఆస్తి ఒప్పంద పత్రం తన వద్ద ఉన్నా.. ఏ మీడియా హౌస్ కు వెళ్లలేని విషయాన్ని ప్రస్తావించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ గౌరవం కోసమే తాను ఆ ఒప్పందాన్ని బయట పెట్టలేదని తేల్చి చెప్పారు.
* నాకోసం ఒక్కటైనా చేశారా
మరోవైపు అన్న కోసం తాను అన్నీ చేశానని.. తనకోసం ఒక్క పని అయినా చేశారా అంటూ తిరిగి ప్రశ్నించారు షర్మిల. రెండు ఎన్నికల్లో సైతం పాదయాత్ర చేసిన విషయాన్ని ప్రస్తావించారు. జగన్ బెయిల్ రద్దు కోసమే తాము కోర్టులో కేసులు వేసామని చెబుతున్నారని.. తాను క్షేమంగా ఉండేందుకు తల్లిని ఎవరైనా జైలులో పెడతారా అని ప్రశ్నించారు షర్మిల. తనకు లాభం జరుగుతుందంటే తల్లిని కోర్టుకు ఏడుస్తారా అని ప్రశ్నించారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో చేర్పించారని.. ఇప్పుడు తల్లి నీకు క్షోభ పెడుతున్నారని.. జగన్ లాంటి వ్యక్తి నాయకుడో.. శాడిస్టో అన్న విషయాన్ని వైసిపి నేతలే తేల్చుకోవాలన్నారు. మొత్తానికైతే జగన్ ను షర్మిల వెంటాడుతున్నారు. వేటాడినంత పని చేస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Sharmila is doing everything to damage jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com