Sakshi Media Ban: విశాఖలో సాక్షి మీడియాను బ్యాన్ చేశారు. అలా చేసింది ఎవరో తెలుసా సాక్షాత్ వైసిపి నేత. ఆ మీడియాలో వార్త రావాలంటే ఒక రేటు.. వార్త ప్రచురితం కావాలంటే మరో రేటు అన్నట్టు.. మీడియా ప్రతినిధులు అమ్ముడుపోయారని బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు ఓ మాజీ ఎమ్మెల్యే. అందుకే తన నియోజకవర్గ వైపు సాక్షి మీడియా ప్రతినిధులు రావద్దు అని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ నేత అంటే.. దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. గత కొద్దిరోజులుగా ఆయన సాక్షి మీడియా ప్రతినిధుల పై ఆగ్రహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తున్నారు.
* వైసీపీలో ఓటమి..
తెలుగుదేశం పార్టీలో వరుసగా మూడుసార్లు గెలిచారు వాసుపల్లి గణేష్ కుమార్. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులే అప్పట్లో గెలిచారు. మిగతా ముగ్గురు టిడిపిలో కొనసాగారు. కానీ వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి గణేష్ కుమార్ టిడిపిలోకి వస్తారన్న ప్రచారం నడిచింది. కానీ క్యాడర్ అభ్యంతరాలతో ఆయన చేరికకు టిడిపిలో బ్రేక్ పడినట్లు వార్తలు వచ్చాయి ఆ మధ్యన. అయితే ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యారు కూడా.
* ప్రాధాన్యత లేకపోవడంతో..
కానీ తాను అనుకున్న స్థితిలో సాక్షి మీడియాలో తనకు తగినంత ప్రాధాన్యం లభించడం లేదన్నది వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన. పేరుకే సాక్షి మీడియా సొంతది అని.. కానీ కనీస స్థాయిలో కవరేజ్ లేకపోవడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారట. పైగా రాజకీయ ప్రత్యర్థులతో సాక్షి ప్రతినిధులు కలిసిపోయారన్న బాధ ఆయనలో ఉందట. అందుకే బాహటంగా ఈ విషయాన్ని చెబుతూ తన నియోజకవర్గ పరిధిలో సాక్షి మీడియా ప్రతినిధులు రావద్దు అని ఆంక్షలు పెట్టారట. అయితే రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. కానీ ముందుగానే ఓపెన్ అయ్యారు వాసుపల్లి గణేష్ కుమార్. అయితే దీనిపై భారతి మేడంకు ఫిర్యాదు చేస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ చెబుతుండడం మాత్రం సంచలనంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
