Duvvada Srinivas: రాజకీయాల్లో ప్రచారం అనేది ఒక కీలక ఘట్టం. ప్రచారం లేకపోతే రాజకీయాల్లో రాణించలేరు కూడా. కేవలం ప్రచారం ద్వారా ఎదిగిన నేతలు చాలామంది ఉన్నారు. ఎదిగిన తర్వాతే ఈ ప్రచారం అంతగా అవసరం ఉండదు. అయితే ప్రచారం విషయంలో ఏ స్థాయిలో ముందుకు వెళ్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంటకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఎందుకంటే నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆ జంట చేసిన హల్చల్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఏ ఛానల్లో చూసిన వారే.. ఏ డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ లో చూసిన వారే. అంతలా కుమ్మేశారు. ఒక పగడ్బందీ ప్రణాళికతో అడుగులు వేశారు.
* రోజంతా హైడ్రామా..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ పై పోలీసులు విచారణకు పిలిచారు. అయితే తన సహచరి మాధురి తో కలిసి విచారణకు హాజరయ్యారు దువ్వాడ. దాదాపు 8 గంటల పాటు దువ్వాడ శ్రీనివాస్ కు విచారించారు పోలీసులు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మాధురి ఉన్నారు. కానీ సాధారణ మీడియా జర్నలిస్టులతో పాటు పెద్ద ఎత్తున యూట్యూబర్లు చేరుకున్నారు అక్కడికి. దీనికి తోడు దువ్వాడ అనుచరుగణం వందల సంఖ్యలో అక్కడకు చేరుకోవడం ఆశ్చర్యం వేస్తోంది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు ఆయన ఏ పార్టీకి చెందని వ్యక్తి. అటువంటి నేత కోసం వందలాది మంది రావడం పక్కా ప్రణాళికని అర్థం అవుతోంది.
* సామాజిక వర్గ కోణంలో..
శ్రీకాకుళం జిల్లాలో ఒక సామాజిక వర్గం పెత్తనం సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా… తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ సామాజిక వర్గం వారే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. అయితే మరో ప్రధాన సామాజిక వర్గం ఇందుకు జీర్ణించుకోవడం లేదు. అందుకే ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ధర్మాన, కింజరాపు ఫ్యామిలీలను టార్గెట్ చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. దీంతో సొంత సామాజిక వర్గం అండదండలు ఆయనకు లభిస్తున్నాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు దువ్వాడ జంట. అందుకే యాక్టివిస్టులతో పాటు యూట్యూబర్లు దువ్వాడ జంట విషయంలో చాలా ఆసక్తి చూపుతుంటారు. అందుకే శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామం గా ఉండే కొత్తూరులో సైతం వారు హల్చల్ చేయగలిగారు. 8 గంటల విచారణను రాష్ట్రస్థాయి అంశంగా మార్చగలిగారు.
