Nagurayya Textile Shop: గోరక్షణ అనేది గొప్ప బాధ్యత అని పురాణాలు చెబుతుంటాయి. కానీ దురదృష్టవశాత్తు గోవులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పశు పెంపకం కూడా తగ్గిపోతుంది. వయసు మళ్లిన గోవులు కబేలాలకు తరలిస్తున్నారు. చివరకు రైతులు సైతం గో సంరక్షణ భారంగా పరిగణిస్తుండడంతో పశువులను విక్రయిస్తున్నారు. కానీ కర్నూలు నగరంలో అయితే నాగూరయ్య అనే వ్యక్తి.. నగరంలోని గోవుల కడుపు నింపుతున్నాడు. అలాగని ఆయన రైతు కాదు. వస్త్ర దుకాణం నిర్వహించే వ్యాపారి. నగరంలో ఉన్న పశువులకు దాణా సమకూర్చుతున్నాడు. వాటికి ప్రతిరోజు ఆహారం పెడుతూ ఆకలిని తీర్చుతున్నాడు.
పశువుల దాణా కోసం క్యూ..
కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ కు ఒక ప్రత్యేకత ఉంది. చాలా సినిమాల్లో కూడా చూసాం. అయితే అక్కడ నిత్యం మరో దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలు అయితే చాలు నగరంలోని పదుల సంఖ్యలో పశువులు, ఆవులతో పాటు దూడలు అక్కడకు చేరుతాయి. ఓ దుకాణం వద్దకు క్యూ కడతాయి. అదే నాగూరయ్య వస్త్ర దుకాణం ముందుకు. గత కొంతకాలంగా నాగురయ్య నగరంలోని పశువులకు ఆహారం పెడుతుంటాడు. ప్రతిరోజు 5000 రూపాయల నుంచి పదివేల రూపాయల ఖర్చుతో.. వీధుల్లో తిరిగే పశువులకు దాణా అందిస్తుంటారు. అందుకే పశువులన్నీ విశ్వాసం ప్రదర్శిస్తూ మధ్యాహ్నం అయితే చాలు నాగురయ్య షాపు వద్ద వేచి చూస్తుంటాయి. అతనిని చూడగానే ఎగబడుతుంటాయి.
వాటిని చూసి తట్టుకోలేక..
సాధారణంగా నగరంలో ఉండే పశువులు వ్యర్ధాలను తింటాయి. ఈ క్రమంలో వాటి కడుపులో ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోయి ఇబ్బంది పడుతుంటాయి. కొన్ని పశువులు చనిపోతున్నాయి కూడా. కర్నూలు నగరంలో ఇటువంటి పరిస్థితి ఉండడానికి చూసిన నాగురయ్య తెగ బాధ పడిపోయాడు. అటువంటి పరిస్థితి నుంచి కొన్ని పశువులనైన తప్పించాలని చూశాడు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా నెలకు 5000 నుంచి పదివేల రూపాయలు ఖర్చు చేస్తూ దాణా అందిస్తున్నాడు. కందిపొట్టు దాణా బస్తాలను ప్రతి నెల తెప్పిస్తుంటాడు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడికి వచ్చే పశువులకు ఆహారం అందిస్తుంటాడు. ఈ ఆహారానికి అలవాటు పడిన మూగజీవాలు ప్రతిరోజు కొండారెడ్డి బురుజు సమీపంలోకి చేరడం చూసి స్థానికులు సైతం ఆశ్చర్యపోతుంటారు.
తగ్గుతున్న పెంపకం..
సాధారణంగా పాడి రైతులు గోవులను పెంచుతుంటారు. కానీ క్రమేపి వాటి నిర్వహణ కష్టతరంగా మారడంతో పెంపకం కూడా తగ్గిపోతోంది. సనాతన ధర్మంలో గో సంరక్షణ అత్యంత పవిత్రమైనది. గొప్ప పుణ్యఫలం కూడా ఇస్తుందని పురాణాలు చెబుతుంటాయి. గోమాతను సేవించడం ద్వారా దేవతల అనుగ్రహం లభిస్తుందని.. సకల పాపాలు తొలగి మోక్ష ప్రాప్తి కలుగుతుందని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే వీటిని విశ్వాసంగా తీసుకున్నాడు అని చెప్పలేం కానీ కర్నూలు కి చెందిన ఈ వ్యాపారి దానిని ఒక వ్యసనంగా మార్చుకున్నాడు. గోవులకు ఆహారం అందించి తెగ ఆనంద పడుతుంటాడు.