YSR Congress Party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం. ఇప్పటివరకు జగన్ చుట్టూ ఆ నలుగురు అనే పరిస్థితి ఉండేది. అయితే పార్టీని విభేదించి విజయసాయి రెడ్డి లాంటి వారు బయటకు వెళ్లిపోవడంతో కోటరీ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనాన్ని ఇతర సీనియర్లు సహించుకోలేకపోతున్నారు. ఇది స్పష్టం అవుతుండడంతో జగన్ సైతం పునరాలోచనలో పడ్డారు. సజ్జల విషయంలో వైసీపీలోనే ఒక రకమైన ప్రచారం బలంగా వెళ్తోంది. దీనిని అర్జెంటుగా కట్టడి చేయాలి. మరోవైపు ఒకే సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. దానిని సైతం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే పనిలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కు రాష్ట్ర సమన్వయ బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. అదే జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇతర విభాగాల బాధ్యతలు అప్పగించే ఛాన్స్ కనిపిస్తోంది. కచ్చితంగా ఈ మార్పు వైసీపీలో ఒక సంచలనమే.
* ఆ విమర్శ పెరుగుతుండడంతో..
సజ్జల రామకృష్ణారెడ్డి తీరుతో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీనియర్ల అభిప్రాయం. పైగా ఆయన జనం నుంచి వచ్చిన నాయకుడు కాదు. అందుకే ఈ విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దానికి చెక్ పెట్టాలంటే ఓ సీనియర్ నేతకు రాష్ట్ర సమన్వయ బాధ్యతలు కట్టబెట్టాలన్న నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అందులో భాగంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గతంలో ధర్మాన ప్రసాదరావును ఇలానే ఆహ్వానిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారట. సజ్జల రామకృష్ణారెడ్డికి రిపోర్ట్ చేయాల్సి ఉందని తెలియడంతో వెనక్కి తగ్గారట.
,* రాష్ట్ర సమన్వయ బాధ్యతలు..
మారిన పరిస్థితుల నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రేక్ వేయకపోతే పార్టీలోనే ఒక రకమైన తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాదరావును ఆహ్వానిస్తూ పూర్తిగా స్వేచ్ఛ ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు ధర్మాన సైతం అంగీకారం తెలపడంతో.. సజ్జల రామకృష్ణారెడ్డిని సైడ్ చేసే పనిలో ఉన్నారట. సజ్జలకు పార్టీలో వేరే విభాగం బాధ్యతలు అప్పగించి ధర్మానకు రాష్ట్ర సమన్వయ బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. అందుకే ధర్మాన సైతం విజయవాడలో అందుబాటులోకి ఉండేందుకు వీలుగా ఇల్లు అద్దెకు తీసుకునేందుకు సిద్ధపడుతున్నట్లు వైసిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.