RK Roja: మాజీ మంత్రి రోజా( RK Roja ) భయపడుతున్నారా? కేసులు వెంటాడుతున్నాయా? అందుకే పునరాలోచనలో పడ్డారా? మాటల్లో పొదుపు రావడానికి కారణం అదేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొంతకాలంగా రోజా సైలెంట్ గా ఉన్నారు. మునుపటి దూకుడు కనిపించడం లేదు. అగౌరవ వ్యాఖ్యలు చేయడం లేదు. పైగా ఒక రకమైన స్నేహ వాతావరణాన్ని అలవరచుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం చిన్న కుమారుడు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా స్పందించారు. పవన్ కళ్యాణ్ కు సానుభూతి తెలిపారు. అయితే దీనిని పరిగణలోకి తీసుకోలేం కానీ.. రోజా ఓ మంత్రి ఇంటికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అది రాజీ కోసమేనని రచ్చ నడుస్తోంది. రెడ్ బుక్ కు భయపడి ఆమె రాజీ ఫార్ములాకు వచ్చినట్లు ప్రచారం అయితే మాత్రం చాలా జోరుగా సాగుతోంది.
Also Read: వర్మ మాటలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించించేనా!?
* గత ఐదేళ్లుగా విపరీత ధోరణి..
రోజా వ్యవహార శైలి మామూలుగా ఉండదు. రాజకీయాల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) మాత్రమే నేతగా ఆమె చూస్తారు. ఆయన తప్ప మరొక నేత కాదన్నది ఆమె భావన. గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పై ఈగ వాలనిచ్చేవారు కాదు. పవన్ కళ్యాణ్ పై చులకన చేసి మాట్లాడే వారు. చంద్రబాబు వయసును కూడా గౌరవించేవారు కాదు. అటువంటి ఆమె వ్యవహార శైలిలో ఇటీవల మార్పు చోటుచేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నా.. ఘాటైన విమర్శలకు మాత్రం ఆమె దూరంగా ఉండిపోవడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది.
* ఆడుదాం ఆంధ్రాలో అవినీతి..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె కీలక మంత్రిత్వ శాఖను నిర్వర్తించారు. క్రీడల శాఖ ( sports minister) మంత్రిగా ఉండగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. దీనిపై లోలోపల విచారణ జరుగుతోంది. ఇందులో ప్రధానంగా అప్పటి మంత్రిగా ఉన్న రోజాపై ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ తరుణంలోనే రోజా వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. దూకుడుగా ఉన్న ఆమె ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. మీడియా ముందుకు పెద్దగా కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు.
* రాజీ కోసమేనా?
అయితే ఇటీవల ఆమె విజయవాడలో( Vijayawada) రాయలసీమకు చెందిన మంత్రిని ప్రత్యేకంగా కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అప్పట్లో క్రీడల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే మంత్రిని కలుసుకున్నట్లు సమాచారం. తనను ఇబ్బందుల నుంచి బయటపడి వేయాలని అభ్యర్థించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గత ఐదేళ్లుగా రోజా వ్యవహార శైలి తెలియంది కాదు. అందుకే ఈ విషయంలో తాను ఏమీ చేయలేనని సదరు మంత్రి చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ నుంచి దిగాలుగా రోజా బయటకు వచ్చినట్లు సోషల్ మీడియాలో అయితే ప్రచారం ఒకటి ఊపందుకుంటోంది. మరి ఏం జరిగిందో ఆమెకే తెలియాలి.