Rayalaseema Politics: గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. ఆ పార్టీకి దారుణ ఓటమి ఎదురైంది. అయితే బలమైన ప్రాంతంగా ఉన్న రాయలసీమలో కూడా ఆ పార్టీకి దెబ్బ తగిలింది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం పనిచేయకపోవడం, సైలెంట్ గా ఉండిపోవడంతో వైసీపీకి నష్టం కలిగింది. అయితే ఈసారి రెడ్డి సామాజిక వర్గం యూటర్న్ అవుతుందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు గట్టిగానే కృషి చేస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ అటువంటిదేమీ లేదని.. జగన్మోహన్ రెడ్డిని నమ్మవద్దని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సొంత సామాజిక వర్గానికి పిలుపు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. కచ్చితంగా ఇది వైసీపీకి డామేజ్ చేసే అంశమే. అందుకే వైసీపీ శ్రేణులు మాగుంటపై విరుచుకుపడుతున్నాయి.
* పద్ధతి ప్రకారం కూటమి..
కూటమి ఒక పద్ధతి ప్రకారం వెళ్తోంది. ఎక్కడ సామాజిక వర్గం అనే చర్చ రాకుండా అభివృద్ధి చేయడం ద్వారా రాయలసీమలో పట్టు బిగించాలని చూస్తోంది. గతం కంటే మెరుగుగా రెడ్డి సామాజిక వర్గం మద్దతు తెలుగుదేశం పార్టీతో పాటు కూటమికి ఉంది. ఇప్పుడు వైసీపీకి అదే మింగుడు పడని అంశము. 2014, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తమ వాడిగా చూసుకొని మద్దతు తెలిపింది రెడ్డి సామాజిక వర్గం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా ఎటువంటి పనులు చేపట్టలేదు. పైగా రెడ్డి సామాజిక వర్గం అంటే ఆ నలుగురు నేతలు అన్నట్టు వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే మిగతా నేతలకు అది సహించలేదు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని మూర్ఖుడితో పోల్చారు కూడా.
* అభివృద్ధికి జై కొట్టాల్సిందే..
రెడ్డి సామాజిక వర్గానికి సంక్షేమ పథకాలు దక్కేందుకు వారు వెనుకబడిన తరగతులు వారు కాదు. ఓసీలుగా ఉండడంతో సంక్షేమ పథకాలు కూడా అందడం లేదు. ఆపై వైసీపీ హయాంలో ప్రత్యేక ప్రయోజనాలు ఏమైనా కల్పించారు అంటే అది లేదు. అయితే సామాజికపరంగా వారిని ఆకట్టుకోవచ్చు. అదే శాశ్వత ప్రాజెక్టులతో పాటు ఇతరత్రా అంశాల్లో రాయలసీమకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాధాన్యత ఇచ్చి జగన్ చేసిన తప్పిదాన్ని సరిచేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇది రెడ్డి సామాజిక వర్గం వారిని డిఫెన్స్ లో పెడుతోంది. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచేందుకు ముందుకు వెళ్లేందుకు ఆ సామాజిక వర్గం సాహసించడం లేదు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. వెనుకబడిన ప్రాంతంలో మౌలిక వసతులు కల్పిస్తే ప్రయోజనం అన్నట్టు ఆయన మాట్లాడారు. అటు సంక్షేమ పరంగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రయోజనం లేదు. పోనీ ప్రాజెక్టుల పరంగా అభివృద్ధి చేసి ఉంటే అది బాగుండేది. దానినే గుర్తు చేస్తూ రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డిని నమ్మవద్దు అని ఆయన కోరారు. అయితే అభివృద్ధి చేస్తున్న కూటమిని కాదని రెడ్డి సామాజిక వర్గం రాయలసీమలో రాజకీయం చేసే ఛాన్స్ కూడా కనిపించడం లేదు. అక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గం ఫుల్ సైలెన్స్ కాక తప్పదని తెలుస్తోంది.