Rayalaseema Defence Hub: ఒకప్పుడు రాయలసీమలో రత్నాలు పండేవంటారు. తరువాత ఆ స్థానాన్ని వాణిజ్య పంటలు దక్కించుకున్నాయి. కానీ కరువు సీమలో పంటలు పండాలంటే సాగునీరు అవసరం. ఆ అవసరాన్ని గుర్తించారు సీఎం చంద్రబాబు. సాగునీటిని రాయలసీమకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నదుల అనుసంధానం తో పాటు పట్టిసీమ ప్రాజెక్టు.. రాయలసీమ ప్రత్యేక ప్రాజెక్ట్.. గోదావరి,కృష్ణా జలాల తరలింపు వంటి ఆలోచనతో ఉన్నారు. ఒకవైపు ఆ ప్రయత్నం జరుగుతుండగానే.. పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చూస్తున్నారు రాయలసీమలో. తయారీ రంగ పరిశ్రమలు రాష్ట్రంలో రాయలసీమను అగ్రగామిగా నిలపాలని చూస్తున్నారు. అపారమైన భూ వనరులు ఉన్న రాయలసీమలో పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చని భావిస్తున్నారు.
* ఎందరో ముఖ్యమంత్రులు అయినా..
రాయలసీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ పరిశ్రమల స్థాపనకు ఎవరు పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ చంద్రబాబు మాత్రం రాయలసీమపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తయారీ రంగ పరిశ్రమల హబ్ గా మార్చాలని చూసారు. తిరుపతిలోని శ్రీ సిటీకి పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. అదే స్ఫూర్తితో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం వెయ్యి ఎకరాల భూమిని సమీకరిస్తున్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి అనేది చేసి చూపించాలని చూస్తున్నారు.
* ఐటీ హబ్ గా విశాఖ..
విశాఖను ఇప్పటికే ఐటీ హబ్ గా మార్చే ప్రయత్నంలో కొంత సక్సెస్ అయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు అవుతోంది. మరోవైపు తాజాగా రిలయన్స్ గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖకు చెంతనే.. విజయనగరంలో ఏర్పాటు అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి భూములు కేటాయిస్తూ నిన్ననే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. తద్వారా మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయనేది ఒక అంచనా. ఉభయగోదావరి తో పాటు కృష్ణా గుంటూరు కలిపి కోస్తాంధ్రలో.. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు మరిన్ని మౌలిక వసతుల కల్పన, విద్యాసంస్థలతో పాటు ఇతర సంస్థల ఏర్పాటుతో ఆ ప్రాంతానికి సైతం న్యాయం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ ప్రయత్నం కొంతవరకు వర్కౌట్ అయింది. అమరావతి కోస్తాంధ్రకు మణిహారంగా నిలవనుంది.
* ప్రధాని మోదీ సహకారం..
అయితే ఈ మొత్తం రాష్ట్రాభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ సహకారం అందుతోంది. గత అనుభవాల దృష్ట్యా ఇతర రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి.. రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు సైతం.. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం తీసుకుంటున్నారు. అయితే గతానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వ సహకారం పుష్కలంగా అందుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి. అంతర్జాతీయ సంస్థలు వచ్చేందుకు అవసరమైన అనుమతులతో పాటు కొన్ని రకాల మినహాయింపులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దక్కుతోంది. కేవలం కేంద్రం డేటా పాలసీని మార్చడం వల్లే ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పుడు రక్షణ రంగం తో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల తాలూకా ప్రాజెక్టులు రాయలసీమలో కొలువు తీరుతున్నాయి. నిజంగా చంద్రబాబు, మోదీ కాంబో తోనే ఇది సాధ్యమవుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
