Janasena Party: పవన్ కళ్యాణ్ నిర్మోహమాటంగా చెప్పేశారు. పార్టీని సిద్ధాంత పరంగా నడుపుతానని.. ఇష్టం ఉన్నవారు ఉండండి.. లేకపోయినా వారు వెళ్ళిపొండి అంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మనసు విప్పి మాట్లాడారు. జనసేన ను ఒక ప్రాంతానికి, ఒక కులానికి ఆపాదించవద్దు అని తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక పవన్ కళ్యాణ్ దృష్టికి చాలా అంశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా తెలిస్తే చాలు జనసేన అనేది కాపుల పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన నేతలు కూడా అదే వైఖరితో ఉన్నారు. ఆ వైఖరి మూలంగా జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ పై నమ్మకం ఉన్న ఇతర సామాజిక వర్గాలు సైతం సైడ్ అవుతున్నాయి. దానిని గుర్తించారు పవన్ కళ్యాణ్. అందుకే కులం అనే మాట వినిపించకుండా.. ఒక కులానికి మాత్రమే జనసేనను ఆపాదించకుండా చూడాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న స్పష్టమైన ప్రకటన చేశారు.
* జనసేన చుట్టూ కథలు..
రాష్ట్రంలో కాపుల అంశంపై ఏది జరిగిన దానిని జనసేన చుట్టూ కథలు అల్లడం పరిపాటిగా మారింది. కేవలం పవన్ కళ్యాణ్ విషయంలో కాపుల వైఖరి మారినందునే ఇలా వారిని దూరం చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి ఏపీలో. అయితే ఇదే జనసేన 2019 ఎన్నికల్లో ఉంది. అప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాపులు జనసేన వైపు కాకుండా వైసిపి వైపు చూశారు. ఆ పార్టీ వైఖరి నచ్చకపోవడం వల్లే కూటమి వైపు 2024 ఎన్నికల్లో టర్న్ అయ్యారు. అయితే ఇక్కడ కాపుల ముద్ర అనేది జనసేన వైపు వేయడం ప్రారంభించారు. కేవలం జనసేన ఎదగకుండా చేసేందుకు జరిగే ప్రయత్నం అది. అందులో భాగంగా ఇతర సామాజిక వర్గాలు జనసేన వైపు వెళ్లకుండా ఉండేందుకు వేసిన ఎత్తుగడ అది. దీనిని పవన్ కళ్యాణ్ గుర్తించారు కూడా. కులం మాటున జనసేన ను ఒక చట్రంలో పెట్టి ఎదగకుండా చేయాలి అనుకుంటే తాట తీస్తా అంటూ హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరిక కేవలం రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమే కాదు. జనసేనలో ఉండే నాయకులకు సైతం ఈ హెచ్చరిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నోరు తెరిస్తే చాలు కాపుల పేరుతో జనసేన పై రాజకీయం చేస్తున్నారు. గత పదేళ్ల కాలం పాటు దీనిని భరించారు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనలో సహనం నశించి ఇప్పుడు గట్టిగానే బదులిస్తున్నారు.
* ఏది జరిగినా వివాదమే..
రాష్ట్రంలో కాపులకు ఏదైనా ఇబ్బంది కలిగితే జనసేనకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నేతలు తప్పు చేస్తే దానిని సైతం తప్పుపడుతున్నారు. కేవలం జనసేన అంటే కాపుల పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ గమనించిన పవన్ కళ్యాణ్ గట్టిగానే నిన్న సంకేతాలు పంపారు. తమిళనాడులో విజయ్ పార్టీ పెడితే అన్ని కులాలు మద్దతు తెలిపాయని.. ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితి లేదని ఆవేదనతో అన్నారు. జనసేన శ్రేణులు సైతం ఈ విషయంలో తప్పు చేయవద్దు అని.. లేనిపోని కుల ప్రస్తావనలు తీసుకురావద్దని సంకేతాలు పంపారు పవన్.
