Mani Annapureddy: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ పై పెద్ద ఎత్తున దాడి జరిగింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేశాయి. ఈ తరుణంలో వైసీపీ శ్రేణులు న్యాయమూర్తులపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం ఏమిటని రాజ్యాంగబద్ధ పదవులు అనుభవించిన వైసీపీ నేతలు ప్రశ్నించారు. అయితే సోషల్ మీడియా వేదిక గా జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలపైకోర్టులు సీరియస్ అయ్యాయి.దీంతో చాలామంది పై కేసులు నమోదు అయ్యాయి.ఒకరిద్దరూ జైలు జీవితం సైతం అనుభవించారు. ఈ తరుణంలో విదేశాల్లో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. కానీ చాలామంది తప్పించుకున్నారు. అందులో మణి అన్నపురెడ్డి ఒకరు. ఈయన వైసిపి యూఎస్ఏ కన్వీనర్ గా ఉన్నారు.
గతంలో మణి అన్నపురెడ్డిని అరెస్టు చేసేందుకు సిబిఐ ప్రయత్నించింది. ఇంటర్ పోల్ సహకారంతో పావులు కదిపింది. కానీ అరెస్టు చేయలేకపోయింది. అయితే ఇప్పుడు సడన్ గా మణి అన్నపురెడ్డి మారువేషంలో కనిపించారు. సీఎం జగన్ తో పాటు విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. వారితో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు శివ అన్నపురెడ్డి పేరుతో ఉన్న ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు. వైసీపీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.అయితే ఈ శివ అన్నపురెడ్డి.. మణి అన్నపురెడ్డి గా గుర్తించిన కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో మణి అన్నపురెడ్డి అలర్ట్ అయ్యారు. శివ అన్నపురెడ్డి పేరిట ఇన్నాళ్ళు కొనసాగిస్తున్న పేస్బుక్ ఖాతాను తొలగించారు.
అయితే మణి అన్నపురెడ్డి విదేశాల నుంచి ఎలా వచ్చారు? శివ అన్నపురెడ్డి అని పేరు మార్చుకున్నారా? ఫేక్ పాస్పోర్ట్ తయారు చేశారా? అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. శివ అన్నపురెడ్డి పేరుతో చలామణి అవుతున్న మణి అన్నపురెడ్డి విదేశాలకు పారిపోకుండా చూడాలని కోరారు. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసేలా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో కోరారు. న్యాయమూర్తులపై దూషణ కేసు పూర్వాపరాలు, వాటిలో మణి అన్నపురెడ్డి పాత్ర, స్వదేశానికి వచ్చి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడం వంటి అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.