YCP in-charges: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గానే తీసుకున్నారు. కచ్చితంగా ప్రతి చోట పార్టీ అభ్యర్థిని పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలా చేయకపోతే నియోజకవర్గ ఇన్చార్జిల కు టికెట్ ఇవ్వనని కూడా తేల్చి చెప్పారు. తద్వారా తాను స్థానిక సంస్థల ఎన్నికలను ఏ స్థాయిలో సీరియస్ గా తీసుకుంటున్నానో స్పష్టంగా చెప్పారు. గెలుపు ఓటములతో సంబంధం లేదు.. ప్రతి చోట పార్టీ అభ్యర్థి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం అయిన జగన్.. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేది లేదు అంటూ తేల్చి చెప్పడం విశేషం. క్యాడర్ను నిలబెట్టే సువర్ణ అవకాశంగా స్థానిక సంస్థలను అభివర్ణించారు. ఇప్పుడు కార్యకర్తను బరిలో ఉంచితేనే క్యాడర్ నిలబడి.. సార్వత్రిక ఎన్నికల్లో పనిచేస్తుందన్న విషయాన్ని గ్రహించుకోవాలని హితబోధ చేశారు.
అప్పట్లో ఏకగ్రీవాలే అధికం..
ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పిదం లేదు. కానీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల స్వరూపాన్ని మార్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో చంద్రబాబుకు ఆ అవకాశం రాలేదు. కానీ 2021లో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే స్థానిక సంస్థల అన్నింటికీ ఎన్నికలు జరిగాయి. 2018లో సర్పంచుల పదవీకాలం ముగిసిన చంద్రబాబు మాత్రం ఎన్నికల వైపు చూడలేదు. అప్పటివరకు ప్రలోభాలు, బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ వంటివి స్థానిక సంస్థల్లో చూడలేదు. కానీ 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు, బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ వంటివి జోరుగా సాగాయి. చివరికి మండలంలో లక్ష వరకు ఓట్లు ఉండే పరిస్థితి ఉన్న జడ్పిటిసి ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు చేసుకున్నారంటే.. ఏ స్థాయిలో దూకుడు పెంచారో అర్థం అవుతోంది.
డబ్బులు ఇస్తేనే క్యాడర్ నిలబడేది..
అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపారు. అప్పుడు చెప్పిన నినాదం అభివృద్ధి. కానీ ఇప్పుడు ఏకగ్రీవాలు వద్దు అంటున్నారు. ఇది మాత్రం ముమ్మాటికీ రాజకీయ ప్రయోజనాల కోసమే. చాలాచోట్ల గ్రామపంచాయతీల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అటువంటి చోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల పుణ్యమా అని.. కచ్చితంగా వివాదం జరుగుతుంది. అధినేత ఆ స్థాయిలో ప్రకటన చేసేసరికి.. నియోజకవర్గ ఇన్చార్జిలతో పాటు క్యాడర్ కూడా తలంచక తప్పని పరిస్థితి. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అనేసరికి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిలపై భారం పడటం ఖాయం. ఎందుకంటే ఎన్నికలు అంటేనే డబ్బుల ప్రవాహం. అందునా పార్టీ ప్రోత్సాహం ఉండడంతో.. కచ్చితంగా గ్రామస్థాయి క్యాడర్ ఇన్చార్జిలపైనే ఆధారపడక తప్పదు. అధికార పార్టీకి తట్టుకొని నిలబడాలంటే తమ ఆర్థిక స్తోమత సరిపడదు అని క్యాడర్ తేలిపోతుంది. అప్పుడు వారికి డబ్బులు ఇచ్చి నిలబెట్టాల్సిన దుస్థితి వైసిపి నియోజకవర్గ ఇన్చార్జి లకు దాపురిస్తోంది అన్నమాట.