Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత కేంద్ర పెద్దలను కలుస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రధానంగా ఈ ప్రచారం జరిగింది. త్వరలో కేంద్ర పెద్దలను జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారని.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కేంద్ర పెద్దలు అక్షింతలు వేస్తారు అనేది ఈ ప్రచార సారాంశం. ఇప్పటికీ కేంద్రంలో జగన్ ప్రాధాన్యత తగ్గలేదని.. భవిష్యత్తు రాజకీయ కారణాలతో ఆయనకు ఇప్పటికీ కేంద్ర పెద్దల వద్ద గుర్తింపు ఉందంటూ వైసీపీ ప్రచారం చేసుకుంది. కొద్ది నెలల కిందట జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలుస్తారని కూడా టాక్ నడిచింది. కానీ ఇంతవరకు కలవలేదంటే కచ్చితంగా ఆయనకు అపాయింట్మెంట్ లభించినట్టే. ప్రస్తుతం ఏపీలో పాత కేసులకు సంబంధించి ఈడి దూకుడు పెంచింది. సహజంగా ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా కేంద్ర పెద్దలను కలవాలి. ఇప్పుడు దాని గురించి వైసీపీలో చర్చ లేదంటే కేంద్ర పెద్దలు ముఖం చాటేసినట్టే.
* ఆర్థిక కోణంలో కేసులు..
వైయస్ వివేకానంద రెడ్డి కేసు క్లోజ్ అవుతుందని అంతా భావించారు. గతంలో ఈ హత్యకు సంబంధించిన సాక్షాలు చెరిపేయడంతో సిబిఐ సైతం చేతులెత్తేసినట్లు ప్రచారం నడిచింది. అయితే ఆయన తనయ సునీత గట్టి న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి వివేకా హత్య కేసులో మనీ ట్రయల్ వేటలో ఈడి చేసిన తనిఖీ లో కీలక ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ పై కూడా ఈడి దూకుడు పెంచింది. అయితే ఇది ఒక విధంగా ఆందోళనకు గురి చేసే విషయమే. ఇటువంటి సంక్లిష్ట సమయంలో కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలవాలి. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసు మరింత ముందుకు వెళితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అనడానికి వీల్లేదు. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో పెద్ద నష్టం చేసింది వివేకానంద రెడ్డి హత్య కేసు.
* ఏడేళ్లు జాప్యం వెనుక..
వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏడేళ్లు జాప్యం జరగడం వెనుక కేంద్ర ప్రభుత్వ సహకారం జగన్మోహన్ రెడ్డికి ఉందనేది బలమైన వాదన. తెర వెనుక సహకారం అందించడం వల్లే ఈ కేసులో అసలు నిందితులు పట్టుబడలేదని.. అసలు గుట్టు బయటపడలేదని ప్రచారం ఉంది. అటువంటి కేసులో సడన్గా ఈడీ ఎంట్రీ ఇవ్వడం వెనుక కేంద్ర పెద్దల అనుమతులు ఉన్నాయి అనేది ఇప్పుడు అనుమానం. ఏపీ సీఎం చంద్రబాబు తన చేతికి మట్టి అంటకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అనేది మెజారిటీ వైసీపీ శ్రేణుల అభిప్రాయం. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయిన.. 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగడం ఆందోళన కలిగించే విషయం. కచ్చితంగా ఇందులో కేంద్ర పెద్దల ఆదేశాలు ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ కేసుల విషయంలో ముందడుగు వేస్తోంది ఈడి. తనకు ఉన్న పాత పరిచయాల ద్వారా కచ్చితంగా కేంద్ర పెద్దలను కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి ఉంటారు. అది వీలు పడలేదు అంటే పరిస్థితి చేయి దాటుతున్నట్టే అని స్పష్టం అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.