Jagan: వరుస సర్వేలతో అధికార వైసీపీలో ఆందోళన నెలకొంది.ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. కూటమికే మొగ్గు కనిపిస్తోందని అనేక సర్వేలు వెల్లడించాయి. అటు టీవీ9 రవి ప్రకాష్ తన ఆర్ టీవీలో స్టడీ పేరిట వెల్లడించిన ఫలితాల్లో సైతం వైసీపీకి ప్రమాదం తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. రాయలసీమలో గతంలా పరిస్థితి ఉండదని రవి ప్రకాష్ తేల్చేశారు. కోస్తా, గోదావరి, ఉత్తరాంధ్రలో కూటమిదే పైచేయి అని సంకేతాలు ఇచ్చారు. ఈ తరుణంలో వైసీపీలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. టీవీ9 రవి ప్రకాష్ కు విశ్వసనీయత లేదంటూనే.. మరోవైపు ఆ పార్టీ ఆందోళనతో గడుపుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పార్దా దాస్ సర్వే కొద్దిపాటి ఉపశమనం ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టిన సదరు సంస్థ ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రంలో పురుషులు తెలుగుదేశం కూటమి వైపు మొగ్గు చూపుతుండగా.. మహిళలు మాత్రం ఏకపక్షంగా వైసిపి వైపు ఉన్నట్లు తేలుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 50.18 శాతం మంది పురుషులు టిడిపి కూటమి వైపు మొగ్గు చూపారు. అదే వైసీపీ విషయానికి వచ్చేసరికి 46.5% మంది మద్దతు తెలిపారు. ఇక్కడ టిడిపి కూటమికి మూడు శాతం మంది అదనంగా మద్దతు తెలపడం విశేషం.మరోవైపు మహిళలు 56.12% వైసీపీ వైపు మొగ్గుచూపగా.. టిడిపి కూటమికి కేవలం 41.21% మంది మాత్రమే మద్దతు తెలిపారు. టిడిపి కంటే 15% మంది మహిళలు వైసీపీ వైపు మొగ్గు చూపడం విశేషం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేశారు. దాదాపు అన్ని పథకాలను మహిళల పేరిటే మంజూరు చేశారు. దీంతో వారు సంక్షేమం పట్ల ఆకర్షితులు అయ్యారు. అందుకే వైసీపీకి బలమైన మద్దతుదారులుగా నిలిచారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలకే సంక్షేమ పథకాలలో ఎక్కువగా వచ్చింది. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా.. ఇలా అన్ని పథకాలు వారి పేరుతోనే మంజూరు అవుతున్నాయి. సహజంగానే ఈ పథకాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే వారంతా వైసీపీకి తమ మద్దతు తెలుపుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. మొత్తానికైతే ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పార్ధ దాస్ సర్వే కొత్త ఊపిరి ఇచ్చినట్లు అయ్యింది.