AP Elections 2024: ఏపీలో పోలింగ్ సమీపిస్తోంది. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. మరోవైపు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. గెలుపు తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే టీవీ9 రవి ప్రకాష్ తన ఆర్ టివిలో స్టడీ పేరిట ఎన్నికల ఫలితాలను అంచనా వేసి ప్రకటిస్తున్నారు. రాయలసీమలో వైసీపీకి గతం కంటే సీట్లు గణనీయంగా తగ్గుముఖం పడతాయని ప్రకటించారు. ఇంకో వైపు పార్దాదాస్ తన సర్వేను ప్రకటించారు. పురుషుల్లో టిడిపికి స్వల్ప ఆధిక్యత ఉండగా.. మహిళలు మాత్రం భారీగా వైసిపికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మూవ్ అనే సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వేలో భిన్న ఫలితాలను ప్రకటించింది.
దాదాపు మెజారిటీ సర్వేలన్నీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. అదే సమయంలో మరికొన్ని సర్వేలు వైసీపీకి ఏకపక్ష విజయం దక్కుతుందని చెప్పుకొచ్చాయి.అయితే వై నాట్ 175 అన్న నినాదంతో వైసిపి ముందుకెల్తోంది.కానీ ఇటీవల ఆ పార్టీలో సైతం ధీమా తగ్గింది. ప్రభుత్వ వ్యతిరేకత, ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు కొన్ని బాధ్యత వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే ఇందుకు కారణం. విజయం పై బయటకు ధీమా వ్యక్తం చేస్తూనే.. లోలోపల ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. అయితే వరుస సర్వే ఫలితాలు ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ఇప్పుడు సోషల్ మూవ్ సర్వేలో సైతం వైసీపీ ప్రమాద ఘంటికలు తప్పవని తేలడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను.. టీడీపీ 130 నుంచి 139 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది. వైసిపి 36 సీట్లకే పరిమితం కానుందని స్పష్టం చేసింది. అటు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా సదరు సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది. 22 వరకు పార్లమెంట్ సీట్లను టిడిపి కూటమి గెలుచుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పడం విశేషం. వైసీపీ ప్రభుత్వం పై గత ఐదు సంవత్సరాలుగా తీవ్ర వ్యతిరేకత పెరిగిందని ఈ సర్వే గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు సదరు సంస్థ చెబుతోంది.