Homeఆంధ్రప్రదేశ్‌Vangaveeti Radhakrishna: వంగవీటి రాధా పోటీ చేస్తున్నారా?

Vangaveeti Radhakrishna: వంగవీటి రాధా పోటీ చేస్తున్నారా?

Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాకృష్ణ.. పరిచయం అక్కర్లేని పేరు. దివంగత వంగవీటి మోహన్ రంగ వారసుడు. విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేయడంతో 2009 నుంచి యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మోహన్ రంగా మరణానంతరం.. ఆయన వారసుడిగా 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ అటు తరువాత రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు. 2019 ఎన్నికల్లో అసలు పోటీ చేయలేకపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో రాధాకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

వంగవీటి రాధాకృష్ణకు అన్ని పార్టీల్లో సన్నిహితులు ఉన్నారు. తరచూ వారిని మర్యాదపూర్వకంగా కలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ చర్చకు కారణం అవుతుంటారు. తాజాగా ఆయన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను కలిశారు. అటు తరువాత మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరిని కలిశారు. ఇప్పటికే బాలశౌరి వైసీపీని వీడి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. మచిలీపట్నం నుంచి ఆయనే జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ముందుగా నాదెండ్ల మనోహర్ ను కలవడం, తరువాత బాలశౌరిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటినుంచి వంగవీటి రాధా జనసేనలో చే రతారన్న ప్రచారం ఊపందుకుంది.

మచిలీపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలోని అవనిగడ్డ నుంచి వంగవీటి రాధా పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. కానీ ఇంతవరకు అక్కడ అభ్యర్థి ఖరారు కాలేదు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో కావడంతో బలమైన అభ్యర్థిని బరిలోదించాలని బాలశౌరి భావిస్తున్నారు. ఆ బాధ్యతను పవన్ బాలశౌరి పై పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అటు వంగవీటి రాధా కీలక నేత నాదెండ్ల మనోహర్ ను కలవడం, అక్కడకు కొద్దిసేపటికి బాలశౌరిని కలుసుకోవడం.. అవనిగడ్డ కోసమేనని టాక్ నడుస్తోంది. అయితే విజయవాడ నగరం తప్పించి.. వేరేచోట పోటీ చేయన ని రాధా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో వైసిపి మచిలీపట్నం ఎంపీ టికెట్ ను జగన్ రాధాకు ఆఫర్ చేశారు. అప్పుడు కూడా రాధాకృష్ణ తిరస్కరించారు. తనకు ఇష్టమైన విజయవాడ సెంట్రల్ సీటు దక్కకపోయేసరికి పార్టీని వీడారు. అప్పట్లో రాధా తిరస్కరించిన మచిలీపట్నం ఎంపీ సీటును బాలశౌరి దక్కించుకున్నారు. ఇప్పుడు అవనిగడ్డ టికెట్ విషయంలో వంగవీటి రాధాకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular