Vijayawada YCP: విజయవాడ వైసీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.ఇప్పటికే విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు భవ కుమార్ వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు డిసైడ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఆయన విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి ఆయన సైడ్ చేసి దేవినేని అవినాష్ కు నియోజకవర్గ బాధ్యతలను కట్టబెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ విషయంలో పెద్ద రగడ ప్రారంభమైంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. ఆయన తప్పించి నియోజకవర్గ బాధ్యతలను విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు అప్పగించారు. ఈ నిర్ణయాన్ని మల్లాది విష్ణు వ్యతిరేకిస్తున్నారు. ఆయన అనుచరులు సైతం విష్ణుకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఏకంగా రహదారిపై బైఠాయించి వైసిపి హై కమాండ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే పలుమార్లు వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణును కలిసి సాయం చేయాలని కోరారు. కానీ ఫలితం లేకపోయింది. హై కమాండ్ ద్వారా దారిలోకి తెచ్చుకోవాలని చూశారు. అది జరిగే పని కానట్లు తెలుస్తోంది.
వైసీపీలో మల్లాది విష్ణు భవిష్యత్తు ఏంటనేది అగమ్య గోచరంగా మారింది. హైకమాండ్ కొంతమంది దూతలను పంపించి ఎమ్మెల్సీ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయినా విష్ణు అసంతృప్తి వీడలేదు. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి వెల్లంపల్లి సిద్ధపడ్డారు. కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని మల్లాది విష్ణుకు హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆయన సైతం హాజరయ్యేందుకు మొగ్గు చూపారు. కానీ ఆయన అనుచరులు మాత్రం ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమానికి హాజరయ్యేది లేదని.. వెల్లంపల్లి శ్రీనివాస్ నాయకత్వానికి ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో అక్కడ నుంచి మల్లాది విష్ణు ముభావంగా వెళ్ళిపోయారు. విష్ణు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. షర్మిల చేరికతో ఇప్పటికే విష్టుకు ఆహ్వానం అందిందని.. కానీ ఆచీ తూచీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఒకవేళ మల్లాది విష్ణు వైసీపీని వీడితే మాత్రం ఆ పార్టీకి ఎదురు దెబ్బే.
గత ఎన్నికల్లో విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో.. సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. తూర్పు నియోజకవర్గం మాత్రం టిడిపి కైవసం చేసుకుంది. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు స్వల్ప మెజారిటీతోనే బయటపడ్డారు. ఈసారి అక్కడ మూడు స్థానాల్లో వైసిపి గెలుపు డౌటే. ఇప్పటికే తూర్పు నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్న భవకుమార్ పార్టీని వీడారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీలో రెండు వర్గాలు తయారయ్యాయి. అటు పశ్చిమ నియోజకవర్గంలో సైతం పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మల్లాది విష్ణు కానీ దూరమైతే దెబ్బ తప్పదని తెలుస్తోంది. మరోవైపు ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరికతో.. కొత్త క్యాడర్ వస్తుందని అంతా భావించారు. కానీ అనుకున్న స్థాయిలో ఆయన వెంట నాయకులు ఎవరు నడవలేదు. పార్టీలోనూ చేరలేదు. దీంతో వైసీపీకి విజయవాడ నగరంలో అవకాశాలు సన్నగిల్లాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు నమోదవుతాయో చూడాలి.