Homeఆంధ్రప్రదేశ్‌TDP MPs : టీడీపీలో యువ ఎంపీ కలకలం.. అసెంబ్లీ అయితేనే పోటీ అట

TDP MPs : టీడీపీలో యువ ఎంపీ కలకలం.. అసెంబ్లీ అయితేనే పోటీ అట

TDP MPs : టీడీపీలో ఎంపీల వ్యవహార శైలి హైకమాండ్ కు కలవరపెడుతోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ హైకమాండ్ పై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టేశారు. అధినేతకే తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసేది లేదని.. ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని చెప్పడంతో హైకమాండ్ హైరానా పడుతోంది. ఇప్పటికిప్పుడు ఎంపీగా గట్టినేతను ఎంచుకోవడంతో పాటు ఏ అసెంబ్లీ నియోజకవర్గాన్ని రామ్మోహన్ నాయుడుకు కేటాయించాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది.

నిజానికి 2019 ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు అసెంబ్లీ బరిలో దిగుతారని వార్తలు వచ్చాయి. అటు పార్టీ హైకమాండ్ ఇదే కోరుతూ వచ్చారు. కానీ చంద్రబాబు సముదాయించడంతో ఎంపీగా పోటీచేశారు. అంతటి వైసీపీ ప్రభంజనంలో సైతం గెలుపొందారు. 2024 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా అసెంబ్లీకి పోటీచేయాలని భావిస్తున్నారు. అయితే రేపు అధికారంలోకి వస్తే మంత్రి పదవి విషయంలో బాబాయ్ అచ్చెన్నాయుడితో తేడా కొడుతుంది. పైగా ఇప్పటికిప్పుడు ఎంపీ అభ్యర్థిగా గెలుపు గుర్రాన్ని పట్టుకోవడం టీడీపీ హైకమాండ్ కు కష్టమే. అందుకే నాయకత్వం పునరాలోచనలో పడింది.

రామ్మోహన్ నాయుడు నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఆ నియోజకవర్గం నుంచే పోటీచేయాలని ఆలోచిస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. మొన్నటికి మొన్న భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ నియోజకవర్గం ధర్మాన కుటుంబానికి కంచుకోట. 2019 ఎన్నికల్లో ధర్మాన క్రిష్ణదాస్ గెలిచారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా మూడేళ్ళ కాలం పనిచేశారు. ఆయన 2004లో 2009 2012 ఉప ఎన్నికల్లో కూడా ఇదే సీటు నుంచి గెలిచారు. 2024లో కూడా క్రిష్ణదాస్ గెలుస్తారు అని అంటున్నారు. అయితే రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తే రాజకీయ సమీకరణలు మారుతాయని అంటున్నారు.

శ్రీకాకుళం టీడీపీకి కంచుకోట. ఈసారి ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలను గెలిచి స్వీప్ చేయాలని చూస్తోంది.  నాయకుల మధ్య ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తోంది.  రామ్మోహన్ ఎంపీగా అచ్చెన్న ఎమ్మెల్యేగా టికెట్లు కన్ ఫర్మ్ చేస్తే ఏ ఇబ్బందులు రావని కూడా టీడీపీ అధినాయకత్వం లెక్కలు వేసుకుంటోంది. మూడవ టికెట్ ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానికి కూడా ఇచ్చినా అది ఆమె అత్తింటి వారి అకౌంట్ లోకి వెళ్తుంది అని భావిస్తోంది.అయితే రామ్మోహన్ మాత్రం ఈసారి పట్టు విడిచేలా కనిపించడంలేదు అంటున్నారు.  చూడాలి మరీ టీడీపీ హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular