Hybrid Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడుకు రంగం సిద్ధం అయ్యింది. ఎప్పుడు అట్టహాసంగా జరిగే మహానాడు ఈసారి హైబ్రిడ్ విధానంలో జరపనున్నారు. కరోనా లాంటి విపత్తు సమయంలో సైతం ఆన్లైన్లో మహానాడు నిర్వహించారు. ఈసారి మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత జోడించి సరికొత్తగా మహానాడు పండుగ జరుపుతున్నారు. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ముఖ్యంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితుల్లో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో.. మహానాడు పండుగను హైబ్రిడ్ విధానంలోకి మార్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత ప్రతినిధులతో భౌతిక మహానాడు జరగనుంది. దానిని అనుసంధానిస్తూ జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో, క్లస్టర్లలో మహానాడు ను నిర్వహిస్తున్నారు.
* ఈసారి ప్రత్యేకత అదే..
ఈ మహానాడుకు ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వ బదలాయింపు జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియమితులయ్యారు. ఆ పదవి అంటే దాదాపు పార్టీ ఆయన చేతికి వచ్చినట్టే. ఈ పదవి చేపట్టిన తర్వాత తొలిసారి మహానాడు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ పార్టీ శ్రేణులతో నేరుగా మాట్లాడతారు. సాధారణంగా మహానాడు అంటేనే పార్టీ అభివృద్ధి, చాలా రకాల తీర్మానాలు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే పార్టీకి ఒక నిర్దేశం అన్నమాట. టిడిపి ప్రారంభంలో నందమూరి తారకరామారావు.. తర్వాత నారా చంద్రబాబు.. ఇప్పుడు నారా లోకేష్ మార్గదర్శకంలో మహానాడు జరగనుంది.
* అంతటా ఆసక్తి..
ఈ హైబ్రిడ్ మహానాడు పై తెలుగుదేశం పార్టీ కంటే ఇతర రాజకీయ పార్టీలకు ఆసక్తి ఉంది. టిడిపి అంటేనే టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తుందన్న పేరు ఉంది. అయితే ఇప్పుడు అదే టెక్నాలజీని వినియోగించుకొని.. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది టిడిపి శ్రేణులతో హైబ్రిడ్ మహానాడు నిర్వహిస్తున్నారు. దీనికి కర్త, కర్మ, క్రియ నారా లోకేష్. మరోవైపు టిడిపి శ్రేణుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమర్థ నాయకత్వం వైపు అడుగులు వేశారు లోకేష్. దానిని మరింత పటిష్టం చేసుకొనున్నారు. తొలిసారి మహానాడు నిర్వహణ బాధ్యత లోకేష్ తీసుకుంటున్నారు. అయితే డిజిటల్ రూపంలో హైబ్రిడ్ విధానంలో మహానాడు ఆలోచన లోకేష్ దేనని తెలుస్తోంది. పార్టీ బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాది.. ఇప్పటివరకు జరుగుతున్న దానికంటే భిన్నంగా మహానాడు నిర్వహిస్తుండడం మాత్రం ప్రత్యేకమే. ఈ విధానం సక్సెస్ అయితే మాత్రం జాతీయస్థాయిలో సైతం లోకేష్ పేరు మార్మోగడం ఖాయం.
