Andhra Pradesh Crime : సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం కొన్ని రకాల సన్నివేశాలను. కిడ్నాప్ లతోపాటు బెదిరింపుల పర్వం ఓ స్థాయిలో నడుస్తూ ఉంటుంది సినిమాల్లో. అటువంటి ఘటనే ఏపీలో తాజాగా వెలుగు చూసింది. సినిమాలకు తీసిపోని విధంగా ఓ మాజీ ఎమ్మెల్యే తో పాటు ఆయన కుమారుడు రేపిన కలకలం అంతా ఇంతా కాదు. వెంటనే డబ్బులు లేకపోతే నీ కొడుకు దక్కడు అంటూ హెచ్చరికలు.. బాధితుల ఆర్తనాదాలు.. పోలీసుల రంగ ప్రవేశం.. అనుచరుల లొంగుబాటు.. అసలు నిందితుల పరారీ… ఇలా ఓ ఇంట్రెస్ట్ సినిమాను తలపించింది ఓ కిడ్నాప్ కలకలం. పోలీసులు సకాలంలో రంగ ప్రవేశం చేయడంతో సుఖాంతం అయింది. కానీ ప్రధాన నిందితులైన వైసిపి మాజీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడి కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు.
* వ్యాపార లావాదేవీలతో..
గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గతంలో గెలిచారు షేక్ మహమ్మద్ ముస్తఫా. ప్రస్తుతం మాజీ అయిన ఆయనకు గుంటూరులో పొగాకు గోదాం ఉంది. ప్రస్తుతం వ్యాపార లావాదేవీలను మాజీ ఎమ్మెల్యే తో పాటు ఆయన కుమారుడు బషీర్ చూస్తున్నారు. ఏలూరు జిల్లా కొయ్యల గూడానికి చెందిన కడిమి సూర్యచంద్ర రైతుల నుంచి పొగాకు సేకరించి.. గుంటూరులో ముస్తఫా కు విక్రయించేవారు. అయితే ఇటీవల పొగాకు ధరలు భారీగా తగ్గించారు ముస్తఫా. దీంతో తనకు వ్యాపారం గిట్టుబాటు కావడం లేదంటూ సూర్యచంద్రం పొగాకు విక్రయించడం ఆపేసి.. గుంటూరులోనే మరో కంపెనీకి అమ్మకాలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం రుచించలేదు ముస్తఫాకు.
* వ్యాన్ తో సహా స్వాధీనం
సూర్యచంద్రం కు బెదిరించాలని వ్యూహం పన్నారు ముస్తఫా తో పాటు ఆయన కుమారుడు బషీర్. సూర్యచంద్ర కుమారుడు అభి, డ్రైవర్ బాలరాజు, గుమాస్తా దుర్గారావు తో కలిసి సోమవారం రాత్రి పొగాకు బేళ్లను సొంత వాహనంలో లోడ్ చేసుకుని కొయ్యలగూడెం నుంచి గుంటూరు బయలుదేరారు.. కాసేపటికి అభి ఏడుస్తూ తన తండ్రి సూర్యచంద్రం కు ఫోన్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు బషీర్, ఆయన అనుచరులు వచ్చి మమ్మల్ని నూజివీడులో అడ్డగించారని చెప్పుకొచ్చాడు. పొగాకు స్టాక్ తో ఉన్న వ్యాన్ ను లాక్కునిపోయారని.. తమను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని.. వారు అడిగిన సొమ్ము ఇస్తేనే వదిలేస్తామని చెప్పి ఫోన్ పెట్టేసాడు. అంతటితో ఆగకుండా బషీర్ తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. తమకు ఇవ్వాల్సిన సొమ్ముతో పొగాకు గోదాము వద్దకు రావాలని సూచించి ఫోన్ పెట్టాడు. దీనిపై పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే తో సంప్రదింపులు జరిపారు. దీంతో కిడ్నాపైన ముగ్గురిని బషీర్ అనుచరులు తీసుకొచ్చారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తో పాటు ఆయన కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.