Gopalakrishna Dwivedi
Gopalakrishna Dwivedi: వైసిపి అస్మదీయ అధికారులపై వేటు కొనసాగుతోంది. తాజాగా కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని బదిలీ చేసింది ప్రభుత్వం. గతవారం జరిగిన బదిలీల్లో.. కొంతమంది సీనియర్ ఐఏఎస్ లకు కీలక పోస్టింగులు ఇచ్చింది. అప్పుడు పోస్టింగ్ పొందిన వారిలో ద్వివేదిక సైతం ఉన్నారు. జగన్ సర్కార్లో అత్యంత కీలక అధికారిగా ఉన్న ఆయనను జిఏడీకి పంపిస్తారని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఆయనను కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అప్పట్లో ప్రభుత్వ నిర్ణయం పై విస్మయం వ్యక్తం అయ్యింది. విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కార్మిక శాఖ నుంచి రిలీవ్ చేసి సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
జగన్ సర్కార్తో అంట కాగిన అధికారుల్లో గోపాలకృష్ణ ద్వివేది ఒకరు. 2019 ఎన్నికల సమయం నుంచి ఆయన వైసీపీకి సన్నిహితంగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న ఆయన వైసీపీ విజయానికి సహకరించారని తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆరోపించింది. నాటి సీఎం చంద్రబాబు కూడా వివేది కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేయాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైసిపి అధికారంలోకి వచ్చింది. జగన్ సర్కార్ ద్వివేదికి కీలకమైన పోస్టింగులు ఇస్తూ వచ్చింది. గ్రామపంచాయతీ కార్యాలయాలు, సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై వైసిపి రంగులు వేయడం వెనుక ఉన్నది ఆయనేనని తెలుస్తోంది. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ద్వివేది ఆదేశాల పుణ్యం గానే రంగులు వేశారన్న కామెంట్స్ ఉన్నాయి.
వైసీపీ రంగుల పై హైకోర్టు చాలాసార్లు స్పందించింది. తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ద్వివేది విషయంలో జగన్ సర్కార్ చాలా రకాల మినహాయింపులు ఇచ్చింది. కీలక విభాగాలకు పోస్టింగుల్లో కూడా కొనసాగించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ద్వివేదిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని ప్రచారం జరిగింది. ఆయనపై బదిలీ వేటు ఖాయమని.. సాధారణ పరిపాలన శాఖకు పరిమితం చేస్తారని కూడా టాక్ నడిచింది. అయితే ఆయన ఎటువంటి లాబీయింగ్ చేశారో తెలియదు కానీ.. కార్మిక శాఖలో కీలక పోస్ట్ దక్కించుకున్నారు. దీనిపై టిడిపి శ్రేణులే విస్మయం వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ఆయనను సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం విశేషం.