Eyeball Tattoo in Visakhapatnam: సాధారణంగా టాటూలు వేయించుకోవడం ఒక హాబీ. చాలామంది సరదాగా వేసుకుంటారు. మరికొందరు ఇష్టంగా వేసుకుంటారు. కానీ విశాఖలో మాత్రం ఓ యువకుడు ఫ్యాషన్ గా వేయించుకున్నాడు టాటూ. అది కూడా చేతులు పైనో.. భుజం పైనో కాదు. ఏకంగా కళ్ళలో టాటూ వేయించుకున్నాడు. మీరు వింటున్నది నిజం కూడా. అతి కష్టం మీద.. రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా టాటూ వేయించుకున్నాడు. అయితే ఆ యువకుడి కంటి చూపు పోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. దానిపై క్లారిటీ వచ్చింది.
ఇంజనీరింగ్ యువకుడు.. విశాఖ( Visakhapatnam) నగరానికి చెందిన జగదీష్ అనే యువకుడు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అయితే అతడికి చిన్నప్పటినుంచి టాటూలు వేసుకోవడం అంటే చాలా సరదా. దానిని ఒక ఇష్టంగా మార్చుకొని ఏకంగా టాటూ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. నేపాల్ వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. విశాఖలో టాటూల షాపు కూడా పెట్టుకున్నాడు. అయితే అందరికంటే భిన్నంగా ఆలోచించి కళ్ళల్లో ఐబాల్ టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యులు వద్దని వారించారు. స్నేహితులు సైతం ఒప్పుకోలేదు. అయినా సరే టాటూలు వేయించుకునేందుకు సిద్ధపడ్డాడు జగదీష్. ఎందుకు గాను రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. రెండు నుంచి మూడు గంటల పాటు ఈ టాటూ వేసే ప్రక్రియ కొనసాగింది.
అత్యంత కష్టమైన ప్రక్రియ..
సూదుల ద్వారా కళ్ళల్లోకి ఇంకును పంపించి ఈ టాటూ ప్రక్రియ పూర్తయింది. అయితే జగదీష్( Jagdish ) కంటి చూపు పోయినట్లు విశాఖలో ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో సైతం ఇదే టాక్ నడిచింది. ఈ విషయం జగదీష్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. తన కంటి చూపు పోలేదని తేల్చి చెప్పారు. వైద్యుడి వద్దకు వెళ్లానని.. తన కళ్లను పరీక్షించుకున్నానని.. ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారని వివరించాడు జగదీష్. అయితే గిన్నిస్ రికార్డ్ కోసమే ఈ సాహసానికి దిగాడు జగదీష్. తెలుగు రాష్ట్రాల్లో కళ్ళల్లో టాటూ వేసుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
