Duvvada Srinivas: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆయన జగన్ దృష్టిలో పడేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు పై విరుచుకుపడ్డారు. ఆంబోతు నాయుడు అంటూ రెచ్చిపోయారు. గతంలో తాను పెట్టిన పేరును ఇప్పుడు మండలిలో అందరూ సంబోధిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణకు క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. మండలిలో తొలిరోజు బొత్స వర్సెస్ అచ్చం నాయుడు అన్నట్టు పరిస్థితి మారింది. దద్దమ్మ అంటూ బొత్సను ఉద్దేశించి అచ్చం నాయుడు అనగా.. ఎద్దులా పెరిగావు అంటూ బొత్స కౌంటర్ ఇచ్చారు. అయితే ఇది పార్టీలపరంగా వివాదం రేగింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుపడిన దువ్వాడ మాత్రం ఇదే అదునుగా అచ్చం నాయుడు పై విరుచుకుపడ్డారు. ఇదంతా జగన్ ప్రాపకం కోసమేనని ఇట్టే అర్థమయిపోతోంది.
* ఆ అవకాశం లేదు..
అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన జగన్ మాత్రం ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఎందుకంటే దువ్వాడ తన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలతో పార్టీ ఇమేజ్ను డామేజ్ చేశారు. లేనిపోని కుటుంబ వివాదాలను తెచ్చుకొని.. సభ్య సమాజం తలదించుకునేలా చాలా రకాల విన్యాసాలు చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాసును కొంత దూకుడు తనం చూసిన జగన్మోహన్ రెడ్డి చూసి చూడనట్టుగా మొదట వెళ్లారు. కానీ రోజురోజుకు ఆయన పరిస్థితి శృతిమిస్తుండడంతో పార్టీ నుంచి వేటు వేశారు. అయితే శాశ్వత బహిష్కరణ చేయకపోవడంతో మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం జగన్మోహన్ రెడ్డి పట్ల వీర విధేయత వ్యవహరిస్తూ వచ్చారు.
* ప్రోత్సాహం అందించినా..
దువ్వాడ శ్రీనివాస్ ను ఎంతగానో ప్రోత్సహించారు జగన్మోహన్ రెడ్డి. దశాబ్దాల కాలంగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారే కానీ ఒక్కసారి కూడా ఎన్నిక కాలేదు. దాని వెనుక ఆయనకు ఉన్న ప్రజాదరణ ఇట్టే అర్థం అయిపోతుంది. అయినా సరే దూకుడు కలిగిన కింజరాపు ఫ్యామిలీ పై అదే దూకుడు ప్రదర్శించే దువ్వాడ శ్రీనివాస్ లాంటి నేతలు ఉంటే బాగుంటుందన్న కోణంలో ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. కానీ మూడుసార్లు ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ కు చివరిగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ ఇంత చేసినా.. కుటుంబ పరంగా లేనిపోని వివాదాలు తేవడం… భార్యా పిల్లలు ఉండగా మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం.. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో లేనిపోని హడావిడి చేయడంతో పార్టీకి డ్యామేజ్ జరిగింది. దానిని గుర్తించి వేటు వేయడం జరిగింది.
* అనుకోని అవకాశంగా..
తనపై సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో పార్టీ అధినేత నుంచి కదలిక లేదు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మండలిలో రభసను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించారు దువ్వాడ. అందుకే ఇప్పుడు మంత్రి అచ్చం నాయుడు పై తీవ్రస్థాయిలో విరుచుకు పడటం ద్వారా జగన్ దృష్టిలో పడాలని భావించారు. అయితే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా ధర్మాన బ్రదర్స్ మళ్లీ దువ్వాడను తెస్తే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ మిగతా జిల్లా నేతలను లెక్కచేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి తనను పిలుస్తారని ఆశపడ్డారు. కానీ జగన్ మాత్రం మిగతా వైసిపి నేతలను దృష్టిలో పెట్టుకొని దువ్వాడ శ్రీనివాస్ను దగ్గర చేసుకునే అవకాశం లేదని తాడేపల్లి వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే దువ్వాడ చేస్తున్న ప్రయత్నాలు వృధా ప్రయాసగా అర్థం అవుతోంది.
View this post on Instagram