Duvvada Srinivas Controversy: దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట సొంత జిల్లా శ్రీకాకుళంలో హల్చల్ చేసింది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు అందుకున్న దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ విచారణను ఎదుర్కొనగా.. ఆయన సహచరి మాధురి మాత్రం స్టేషన్ బయట హల్చల్ చేశారు. యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను దువ్వాడ శ్రీనివాస్ తిడితే తప్పు అయినప్పుడు.. తమ నేత జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ తిడితే తప్పు కాదా అంటూ లాజిక్ ప్రశ్న వేశారు. తద్వారా తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలం అని చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ పై ఇంకా వైసీపీ సస్పెన్షన్ ఎత్తివేయలేదు. ఆ పార్టీ జిల్లా నేతలకు దువ్వాడకు అస్సలు పడడం లేదు. కానీ దువ్వాడ జంట మాత్రం జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం దాచుకోవడం లేదు. మళ్లీ పార్టీలోకి వస్తాం అన్న ఆశ వారిలో కనిపిస్తోంది. పార్టీ నుంచి గట్టి భరోసా దక్కి ఉంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
* ధర్మాన బ్రదర్స్ తో విభేదాలు..
దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ జిల్లా నేతలుగా ఉన్న ధర్మాన సోదరులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. కింజరాపు కుటుంబంతో కలిసి ధర్మాన కుటుంబం మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడుతుందంటూ పలుమార్లు ఆరోపణలు చేశారు. అయితే కుటుంబ వ్యవహారంతో చాలా రోజుల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది వైసిపి హై కమాండ్. అయితే దీని వెనుక ధర్మాన సోదరుల కుట్ర ఉందంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్స్ కు గురైన తర్వాత శాసనమండలిలో ఓ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో ఎదురుపడిన దువ్వాడ శ్రీనివాస్ ను పలకరించగా… అప్పట్లో దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని చెప్పుకొచ్చారు. కానీ ఇంతవరకు కలిసే అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు మాధురి మాత్రం తాము వైసిపి నేతలమే అన్నట్టు మాట్లాడుతున్నారు. దువ్వాడ శ్రీనివాస్ అయితే కూటమి ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారు.
* ఇండిపెండెంట్ ప్యానల్ తో పోటీ..
అసలు దువ్వాడ జంటను వైసీపీలోకి తీసుకునే పరిస్థితి ఉందా? జిల్లా నేతలు ఒప్పుకుంటారా? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే తనను పార్టీలోకి రాకుండా అడ్డుకుంటారని దువ్వాడ శ్రీనివాస్ కు తెలుసు. అందుకే ఆయన గట్టి ప్లాన్ తో ఉన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలు సిసలైన నాయకుడిని అని చెప్పుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. చివరి నిమిషం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది వీలుకాకపోతే అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోనున్నారు. ఇండిపెండెంట్ ప్యానల్ పెట్టి.. కొంతమంది అభ్యర్థులతో అన్ని నియోజకవర్గాల్లో పోటీకి దిగనున్నారు. సహజంగా ఈ ప్యానల్ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే కుల ప్రాతిపదికన వెళ్తారు దువ్వాడ శ్రీనివాస్. అప్పుడు ఓట్లు చీల్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చనున్నారు. అందుకే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పార్టీలోకి తీసుకుంటే ధర్మాన సోదరులతో పాటు సీనియర్లనుంచి ఇబ్బందులు తప్పవు. తీసుకోకపోతే ఇండిపెండెంట్ ప్యానల్ తో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీకి ఇబ్బంది కలిగించక మానరు.
