YSR Congress Party Protest: డీఎస్సీ అక్రమాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తోంది. రచ్చ కే ప్రాధాన్యమిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం అధికారులతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. వైసిపి తో పాటు డీఎస్సీ అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేస్తోంది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెత్తబడటం లేదు. డీఎస్సీ అక్రమాలపై మరింత గొడవ చేయాలని భావిస్తోంది. అయితే ఈ విషయంలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపికైన వేలాదిమంది ఉపాధ్యాయుల కంటే.. ఎంపిక కాని లక్షలాదిమంది నిరుద్యోగుల పక్షాన నిలిచి వారి ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. డీఎస్సీలో అసలు అక్రమాలకు అవకాశం లేదు అని విద్యాశాఖ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వినే పరిస్థితిలో లేదు.
* ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంశంలో..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ అంశం పైన పోరాటం చేద్దామంటే సరైనది దొరకడం లేదు. మొన్న మధ్యాహ్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. కట్టని మెడికల్ కాలేజీలు కట్టినట్లు.. తాము కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కట్టు కథలు అల్లింది. అయితే అది కేంద్రం పరిధిలో ఉన్న విషయం అని తెలిసినా అదే పనిగా రాజకీయం చేసింది. ప్రజల నుంచి కోటి సంతకాల పేరుతో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కానీ కొద్ది రోజులకే ఆ ఉద్యమాన్ని మధ్యలో వదిలేసింది. అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశం విషయంలో అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలు అంటూ లేనిపోని హంగామా చేస్తోంది.
* ప్రభుత్వం నివృత్తి చేస్తున్నా..
అయితే ఎన్ని రకాల విమర్శలు వచ్చినా డీఎస్సీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్నట్టు వ్యవహరిస్తోంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం డీఎస్సీ నియామకాలు జరగడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. ఎందుకంటే వైసిపి హయాంలో సచివాలయ ఉద్యోగాలను నియమించారు. కేవలం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగాయి. ఎవరికి ఏ ర్యాంకు వచ్చిందో తెలియదు. ఎలా నియమించారో కూడా అప్పట్లో తెలియదు. అయితే అప్పట్లో అది నిరుద్యోగుల అంశం కావడంతో టీడీపీ కూడా చూసి చూడనట్లుగా వదిలేసింది. ఎలా నియామకాలు చేపట్టారని కనీసం అడగలేదు కూడా. అసలు అర్హత సాధించని చాలామందికి పోస్టులు మిగిలిపోవడంతో నియమించారు అప్పట్లో. కానీ అవన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుర్తున్నాయి. రాజకీయం చేయాలి కాబట్టి డీఎస్సీ పై అదే పనిగా బురద జల్లుతోంది. ఇప్పుడు ఏకంగా డీఎస్సీ ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసింది నాయకత్వం. పైగా లీగల్ సెల్ ఏర్పాటు చేసి న్యాయపోరాటానికి సైతం సిద్ధపడుతున్నట్లు ప్రకటిస్తోంది. అయితే పక్కా ఆధారాలు ఉంటే.. వాటితో నేరుగా కోర్టుకు వెళ్ళవచ్చు కదా అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే డీఎస్సీ లో అక్రమాలు కంటే గందరగోళం సృష్టించాలన్నదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.
