Jagan: ఏపీ సీఎం జగన్ బ్యాండేజ్ ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న జగన్ పై గులకరాయి దాడి జరిగింది. అప్పటి నుంచి ఆయన బ్యాండేజ్ తోనే కనిపించారు. అప్పటినుంచి దానిని పెంచుకుంటూ పోతున్నారు. దీనిపై రకరకాల ట్రోల్స్ నడిచాయి. కోడి కత్తి-2 డ్రామా ఎపిసోడ్ అంటూ నెటిజెన్లు ఎక్కువగా కామెంట్లు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులు అయితే ఈ పోస్టులను వైరల్ చేశారు. అయితే తాజాగా ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటన కోసం మీడియా ముందుకు వచ్చిన జగన్ బ్యాండేజ్ ను తీసేసి కనిపించారు.
జగన్ రాష్ట్రవ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర చేపట్టారు. పులివెందులలో యాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో ముగించారు. దాదాపు 25 పార్లమెంట్ స్థానాల్లో మేమంతా బస్సు యాత్ర చేశారు. అయితే విజయవాడ సింగ్ నగర్ సమీపంలో జగన్ పై గులకరాయి దాడి జరిగింది. అదే రాయి పక్కన ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగిలింది. అప్పటినుంచి రచ్చ నడిచింది. ఇది రాజకీయ ప్రత్యర్థులు చేసిన పనేనంటూ వైసీపీ ఆరోపించగా.. విపక్షాలు మాత్రం డ్రామాగా అభివర్ణించాయి. గత అనుభవాల దృష్ట్యా సానుభూతి కోసమే ఇదంతా జరిగిందని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అయితే ఇవేవీ పట్టించుకోని జగన్ మేమంతా సిద్ధం సభల్లో బ్యాండేజ్ తోనే కనిపించారు. ఈరోజు మేనిఫెస్టో ప్రకటించే సమయంలో మాత్రం తీసేశారు. దీంతో ఇదో వైరల్ అంశంగా మారిపోయింది.
సీఎం జగన్ బ్యాండేజ్ తీసిన నేపథ్యంలో టిడిపి నేత నారా లోకేష్ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఇదే వైరల్ గా మారింది.’ ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం. జూమ్ చేసి చూస్తే దెబ్బ మటు మాయం’ అంటూ లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే గులకరాయి దాడి సానుభూతి వర్కౌట్ అవుతుందని వైసిపి భావించింది. కానీ ఈ ఘటన సానుభూతి కంటే వ్యతిరేకత చూపింది. విమర్శలకు కారణమైంది. గత ఎన్నికలకు ముందు వివేక హత్య, కోడి కత్తి దాడి వంటివి విశేషంగా ప్రభావం చూపాయి. ఈ ఎన్నికల్లో అవే ప్రతికూలత చూపుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే గులకరాయి దాడి ఘటన జరగడం ప్రజల్లో ఒక రకమైన అనుమానాలకు కారణమవుతోంది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కోసమేనన్న టాక్ నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ బ్యాండేజ్ ను తొలగించడం చర్చకు దారితీస్తోంది.