Chandrababu Naidu: ఈరోజు ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ ఏపీ రానున్నారు. రాజమండ్రి తో పాటు అనకాపల్లి లో జరిగే భారీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు చంద్రబాబు హాజరు కావడం లేదని తెలియడం హాట్ టాపిక్ గా మారింది. అసలు చంద్రబాబు ఎందుకు హాజరు కావడం లేదు? కారణమేంటి? అన్నది చర్చకు దారితీస్తోంది. మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురందేశ్వరి తో పాటు కూటమికి చెందిన ఇతర ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలంటూ ఆయన ఓటర్లను కోరనున్నారు.
రాజమండ్రి సభలో ప్రధాని మోదీ తో పాటు పవన్, లోకేష్ లు వేదిక పంచుకోనున్నారు. చంద్రబాబు మాత్రం హాజరు కావడం లేదు. అయితే ఇక్కడ బిజెపి అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేస్తున్నారు.ఆమెకు మద్దతుగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు.అయితే టిడిపి తో పొత్తు విషయంలో పురందేశ్వరి చేసిన కృషి అంతా ఇంతా కాదు.అటువంటిది పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి సభకు చంద్రబాబు రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.ఇది రకరకాల చర్చకు కారణమవుతోంది.
రాజమండ్రి సభ అనంతరం ప్రధాని మోదీ అనకాపల్లిలో జరిగే భారీ బహిరంగ సభకు వెళ్ళనున్నారు. ఆయన వెంట పవన్తో పాటు లోకేష్ సైతం వెళ్తారని తెలుస్తోంది. అనకాపల్లి నుంచి బిజెపి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్లమెంట్ స్థానంతో పాటు విశాఖ జిల్లాలో కూటమి తరుపున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు.ఈ సభకు మాత్రం చంద్రబాబు హాజరవుతారు. అయితే రాజమండ్రి సభకు హాజరుకాకుండా.. అనకాపల్లికి చంద్రబాబు రావడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీని వెనుక ఏవైనా విభేదాలు ఉన్నాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే విమాన ఆంక్షలు ఉండడం వల్లే చంద్రబాబు రాజమండ్రి సభలో పాల్గొనడానికి సాధ్యం కాలేదని తెలుస్తోంది. ప్రధాని మోదీ ఆకాశమార్గంలో ప్రయాణించే సమయంలో.. మరో విమానం వెళ్లేందుకు అవకాశం లేదు. అందుకే చంద్రబాబు రాజమండ్రి సభకు హాజరు కావడంలేదని ఆ పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. దీంతో ఈ అనుమానాలకు తెరపడింది.