Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu  : ఆ విషయంలో ఒత్తిడి పెంచిన జగన్.. డిఫెన్స్ లో చంద్రబాబు!

CM Chandrababu  : ఆ విషయంలో ఒత్తిడి పెంచిన జగన్.. డిఫెన్స్ లో చంద్రబాబు!

రాజకీయ పార్టీలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మూల్యం తప్పదు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు దూరమయ్యే ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఇప్పుడు చంద్రబాబుకు అటువంటి సంక్లిష్ట పరిస్థితి ఎదురైంది.

CM Chandrababu  : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండు కీలకమైన బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈనెల 25 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘంగా కొనసాగనున్నాయి. అధికార విపక్షం మధ్య వాడి వేడిగా సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. కీలకమైన బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో పెట్టి ఆమోదించుకోవాలని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది.అందులో ప్రధానమైనది వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. ఈ బిల్లు లోక్సభ ముందుకు వస్తోంది. దీనిని ఎలాగైనా నెగ్గించుకోవాలని బిజెపి పట్టుదలగా ఉంది. అయితే రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. ఈ తరుణంలో ఈ బిల్లుకు ఎన్డీఏ మిత్రులతో పాటు ఇండియా భాగస్వామ్య పక్షాలు, తటస్థ పార్టీల అవసరం ఏర్పడింది. కానీ దేశవ్యాప్తంగా ముస్లిం వర్గాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును ఆమోదిస్తే ముస్లింల హక్కులకు, విధులకు విఘాతం కలుగుతుందని ఆ వర్గాల్లో ఆందోళన ఉంది. జాతీయస్థాయిలో అన్ని రాజకీయ పక్షాలకు ముస్లిం సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బిల్లుకు మద్దతు తెలపవద్దని కోరుతున్నారు. దీంతో ముస్లిం మైనారిటీలను దూరం చేసుకునేందుకు ఇష్టపడని పార్టీలు.. బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నాయి. అయితే ఏపీ విషయంలో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే టిడిపికి చెందిన 16 మంది ఎంపీల మద్దతుతోనే మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి రాగలిగింది. అదే సమయంలో బిజెపికి సానుకూలంగా వైసీపీ ఉండేది. దీంతో ఈ రెండు పార్టీల మద్దతు ఈ బిల్లు విషయంలో ఎవరికి అన్నది చర్చకు దారి తీసింది.

* వైసిపి పూర్తి స్పష్టత
తాజాగా ఈ బిల్లు విషయంలో పూర్తి స్పష్టత ఇచ్చింది వైసిపి. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ చట్టానికి మద్దతు తెలిపే ప్రసక్తి లేదని వైసీపీ స్పష్టం చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. తాము మద్దతు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి సైతం మద్దతు ఇవ్వద్దని కోరారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ముస్లింలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో ఏకపక్షంగా మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో మాత్రం యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు కానీ వారికి వ్యతిరేకంగా వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వైసీపీకి తెలుసు. అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది వైసిపి.

* అందరి చూపు టిడిపి వైపే
అయితే ఇప్పుడు ఈ బిల్లు విషయంలో టిడిపి ఎలా వ్యవహరిస్తుందన్నది హాట్ టాపిక్. అందరి చూపు ఆ పార్టీ పైనే ఉంది. ఇప్పటికే ముస్లిం సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. బిల్లుకు మద్దతు ఇవ్వద్దని కోరారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎప్పటికీ బలమైన మిత్రుడిగా బిజెపి చంద్రబాబును నమ్ముతోంది. అదే సమయంలో ఈ ఎన్నికల్లో ముస్లింలు చంద్రబాబుకు మద్దతు పలికారు. అందుకే చంద్రబాబు డిఫెన్స్ లో పడిపోయారు. జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper