Janasena: ఏపీలో కీలక రాజకీయ పరిణామం. ఉత్తరాంధ్రలో బలమైన కుటుంబం కూటమిలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈ ప్రచారం జరగడం విశేషం. జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ ల పదవిని టార్గెట్ చేస్తూ కొందరు నేతలు పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈ ప్రచారం బలంగా జరుగుతోంది. ప్రధానంగా సీనియర్ నేత బొత్స ఫ్యామిలీ జనసేన అగ్ర నేతలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో గట్టెక్కాలి అంటే వైసీపీలో ఉంటే కష్టం అనే నిర్ణయానికి వచ్చిన బొత్స.. జనసేనలో చేరితే ఎలా ఉంటుంది అనే అభిప్రాయాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. కొంతమంది కుటుంబ సన్నిహితులు జనసేన అగ్ర నేతలతో చర్చలు జరుపుతున్నారు అనేది ఒక ప్రధాన ఊహాగానం. ఏపీ రాజకీయాల్లో శరవేగంగా విస్తరిస్తోంది ఈ ప్రచారం.
* జడ్పీ పీఠంపై గురి..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రత్యక్ష ఎన్నికలకు మొగ్గుచూపింది. అందుకు సంబంధించిన బిల్లును శాసనసభలో పెట్టి ఆమోదించుకుంది. అయితే విజయనగరం జిల్లాకు సంబంధించి బొత్స ఫ్యామిలీ జిల్లా పరిషత్ పీఠంపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బొత్స.. తన కుమార్తె డాక్టర్ అనూషను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నిక అయ్యేలా చేయాలని చూస్తున్నారు. ఇటీవల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా తన కుమార్తె ఉంటుందని చెప్పుకొచ్చిన ఆయన.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావించకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. వైసిపి గుర్తుపై వెళితే గెలుపు కష్టం. అందుకే జనసేన వైపు బొత్స చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. జనసేనలో చేరేందుకు ఆ ఫ్యామిలీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
– మెగా ఫ్యామిలీతో అనుబంధం..
చిరంజీవి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది బొత్స సత్యనారాయణ కు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో ఉంటే పిల్లల రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దలేం అన్న బెంగ బొత్స లో ఉంది. అలాగని టిడిపిలో చేరలేరు. దశాబ్దాలుగా పార్టీ పై పోరాటం చేస్తూ వస్తున్నారు. అందుకే ఇప్పుడు బొత్స దృష్టి జనసేన పై పడినట్లు తెలుస్తోంది. తన కుమార్తె డాక్టర్ అనూష కు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఇస్తే జనసేనలో చేరేందుకు బొత్స ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలను జనసేన పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. బొత్స లాంటి పెద్ద నేత జనసేన లోకి వస్తే కచ్చితంగా కూటమిపై ప్రభావం ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరుగుతున్నాయని.. అవి కొలిక్కి వచ్చాక కూటమి ఒక్క నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..