Botsa Satyanarayana: ఉత్తరాంధ్ర పై ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పటికే సీనియర్ నేత బొత్స కు ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా సొంత జిల్లా విజయనగరంలో ఆయన పట్టు పోతోంది. పైగా పార్టీ బలహీనం అవుతున్న పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు అన్నట్టు ప్రచారం ఉంది. దీనికి తోడు బొత్స ఫ్యామిలీ జనసేన వైపు చూస్తున్న ప్రచారం జోరుగా సాగుతోంది. దానిని బొత్స ఖండించకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. అందుకే ఇప్పుడు బొత్స విషయంలో వేరే ఆలోచనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర నేతలను మోహరించినట్లు ప్రచారం జరుగుతోంది.
* వైఖరిలో మార్పు..
బొత్స వైఖరిలో ఇటీవల మార్పు వచ్చింది. దానికి కారణం భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా.. వారసులకు సరైన భవిష్యత్తు కల్పించాలన్న ఆలోచన. బొత్స సత్యనారాయణ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు వైద్య వృత్తిలో ఉన్న వారే. 2024 ఎన్నికల్లో వారిని రాజకీయాల్లోకి తేవాలన్న ఆలోచనలో బొత్స ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. అందుకే వారి ఎంట్రీ ఆలస్యం జరిగింది. ఇప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు బొత్స. ఒకవేళ 2029 సార్వత్రిక ఎన్నికల్లో పరిచయం చేసి.. ఓడిపోతే మాత్రం వారసులకు రాజకీయ భవిష్యత్తు లేనట్టే. అందుకే కూటమి పార్టీలో చేరి పిల్లలకు సరైన భవిష్యత్ కల్పించాలన్న ఆలోచనతో ఉన్నారు. జనసేనకు టచ్ లోకి వెళ్లి చర్చలు జరిపినట్టు టాక్ నడుస్తోంది.
* సీనియర్ నేతల కుటుంబాల అసంతృప్తి..
మరోవైపు ఉత్తరాంధ్ర పై బొత్స పెత్తనాన్ని మిగతా సీనియర్ నేతల కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వచ్చారు. ఆ సమయంలోను జగన్ వెంట బొత్స కనిపిస్తూ హైలైట్ అయ్యారు. ధర్మాన బ్రదర్స్కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇదే విషయంపై ధర్మాన ప్రసాదరావు కుమారుడు బాహటంగానే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం జగన్ వరకు వెళ్లినట్లు సమాచారం. ఒకవైపు పార్టీ కోసం బొత్స అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. జనసేనలో చేరికను ఖండించడం లేదు. అందుకే జగన్ సీరియస్ గా ప్రత్యామ్నాయం పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. 2014లో బొత్స లేని విజయనగరం చూశారు. 2019లో బొత్స వచ్చిన తర్వాత వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు బొత్స వెళ్ళిపోతే మాత్రం అదే స్థాయిలో నష్టం జరగక తప్పదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.