APSRTC: ఏపీలో మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఎప్పటి వరకు ఉచిత ప్రయాణం అందిస్తోంది. ఇప్పుడు మరికొన్ని బస్సుల్లో సైతం ఉచిత ప్రయాణం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఏడాది కిందట ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఇప్పటివరకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ వచ్చారు. ఏడాది పూర్తవుతున్న తరుణంలో సీఎం చంద్రబాబు మహిళలకు తీపి కబురు చెప్పారు. ఏసీ బస్సుల్లో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించునున్నట్లు ప్రకటించారు.
* ఎలక్ట్రిక్ ఏసి బస్సుల్లో..
ఏపీ గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఆర్టీసీకి త్వరలో విద్యుత్ ఏసి ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు సభలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని.. వాటిని మహిళలు నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఈఏసి బస్సులు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయి. అందుకే మహిళలకు స్త్రీ శక్తి పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేయడంతో ఏసి బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణించే అవకాశం రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సరిపడా బస్సులు లేకపోవడంతో సెలవు దినాలు, పండగ సమయాల్లో రద్దీ కనిపిస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విద్యుత్ బస్సులను కేటాయించింది. విడతల వారీగా బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
* ఏడాది పూర్తి..
గత ఏడాది ఆగస్టు 15న మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. మహిళలతో పాటు దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. దివ్యాంగులకు తోడుగా వచ్చే వ్యక్తికి టికెట్ ధరలు 50% రాయితీ కూడా అందిస్తోంది. అయితే మహిళలకు ఎప్పటి వరకు అయిదు బస్సు సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ఉండేది. అయితే త్వరలో అన్ని డిపోలకు అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఏసి బస్సుల్లో సైతం ఉచిత ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం విశేషం. నిజంగా ఇది మహిళలకు గుడ్ న్యూస్.