Bhuma Mounika Reddy: రాజకీయాల్లోకి మంచు ఫ్యామిలీ నుంచి ఒక మహిళ రానున్నారు. మంచు మోహన్ బాబు రెండో కోడలు, మంచు మనోజ్ భార్య భూమా మౌనికా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ కి రంగం సిద్ధం అయింది. వచ్చే ఎన్నికల్లో ఆమె బరిలో ఉంటారని భర్త మనోజ్ ప్రకటించారు. ఇటీవల ఈ దంపతులు ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే దానిని ప్రారంభించారన్న విమర్శలు వచ్చాయి. దీనిపై మనోజ్ క్లారిటీ ఇచ్చారు. సేవా కార్యక్రమాల్లో భాగంగానే తాము ఆ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. తన భార్య మౌనికా రెడ్డి కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో మౌనిక రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఖాయమని తేలిపోయింది. అయితే ఏ పార్టీలో చేరుతారు అన్న విషయం పై మాత్రం మంచు మనోజ్ క్లారిటీ ఇవ్వలేదు.
* భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె..
మౌనికా రెడ్డి భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె. పెద్ద కుమార్తె అఖిల ప్రియా రెడ్డి ఆళ్లగడ్డ టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాయలసీమలో భూమా కుటుంబానికి ప్రత్యేక రాజకీయ ప్రస్థానం ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలు చేసిన భూమా తర్వాత కాలంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజారాజ్యంలోకి వచ్చారు. ప్రజారాజ్యం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత టిడిపిలోకి వచ్చారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పని చేయడం భూమా కుటుంబ ప్రత్యేకత. ఆళ్లగడ్డ తో పాటు నంద్యాల ప్రాంతంలో ఆ కుటుంబానికి మంచి పట్టు ఉంది. భూమా నాగిరెడ్డి చనిపోయిన సమయంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో టిడిపి కి మద్దతుగా భూమా మౌనికా రెడ్డి ప్రచారం చేశారు. నిండు గర్భిణిగా ఉన్న సమయంలోనే ఆమె ప్రచార సభల్లో పాల్గొని మంచి వాగ్దాటితో ఆకట్టుకున్నారు.
* టిడిపి నుంచి పోటీ?
మంచు మనోజ్ మౌనికా రెడ్డి ని వివాహం ఆడిన తర్వాత.. మంచు ఫ్యామిలీలో చాలా రకాల పరిణామాలు జరిగాయి. అయితే ఇటీవల వివాదాలు అన్ని కొలిక్కి వచ్చాయి. మిరాయి చిత్రంతో నటుడిగా మళ్లీ తన సత్తా చాటుకున్నారు మనోజ్. అందుకే స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు ఆ దంపతులు. అయితే ఆమె పొలిటికల్ ఎంట్రీ పై మనోజ్ ప్రకటన చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో త్వరలో నియోజకవర్గాలు పెరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో మౌనిక రెడ్డి టిడిపి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన నుంచి పోటీ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఎన్నికల ముంగిట దీనిపై క్లారిటీ రానుంది.
