AP Local elections: ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆ నియోజకవర్గ ఇన్చార్జి టికెట్ ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పారు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు కచ్చితంగా ఉండాలని.. లేకుంటే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దూకుడుగా పని చేశాయి. బలవంతంగా ఏకగ్రీవాలు చేశాయి. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తాము ఎంతలా ఏకగ్రీవాలు చేశామో అన్నది వైసీపీ నేతలకు తెలుసు. అందుకే ఇప్పుడు ఏకగ్రీవాలు ఎట్టా ఆపగలం అన్న ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది. తప్పకుండా ఇది తమని బలి పశువులను చేయడమేనని వారు భావిస్తున్నారు.
చంద్రబాబు గట్టి వ్యూహం..
మరోవైపు చంద్రబాబు దీనిని ముందుగానే పసిగట్టారు. అందుకే స్థానిక సంస్థలకు సంబంధించి మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలను ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని తీసుకొచ్చారు. ఒకవైపు ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉంటారు. అంటే ఇక్కడే ఒక విషయాన్ని గ్రహించాలి. కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ లకు అభ్యర్థులను పెడుతుంది. కానీ మిగతా వాటి విషయంలో మాత్రం ఎక్కువగా ఏకగ్రీవాలు చేసుకుంటుంది అధికార కూటమి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే పెట్టుబడితో కూడుకున్న పని.. ప్రతిపక్ష పార్టీగా వైసిపి నుంచి రూపాయి రాదు.
భారీగా ఖర్చు..
అయితే ఇప్పుడు నియోజకవర్గ ఇన్చార్జిలు తలలు పట్టుకుంటున్నారు. కచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి ఒక మున్సిపాలిటీ దాదాపు ఉంటుంది. నగర పంచాయతీ అయినా కొనసాగుతూ ఉంటుంది. అటువంటి చోట కౌన్సిలర్లుగా అభ్యర్థులను దించడం అంటే సులువు కాదు. ఆపై ప్రత్యక్ష ఎన్నికకు ఆర్థికంగా ఉండే అభ్యర్థిని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మాత్రం చేతి చమురు వదలడం ఖాయం. ఇక జడ్పిటిసి లతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను రంగంలోకి దించడం కూడా కష్టమే. అయితే కొంతమంది ఇన్చార్జిలు ఇప్పటినుంచే ఒక ఆలోచన చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహం ఉండి.. అవకాశం దక్కని చోటానేతలను ఎంచుకుంటున్నారు. నువ్వే ఎంపీటీసీ, నువ్వే జడ్పిటిసి అని ఇప్పుడే బొట్టు పెడుతున్నారు. ఖర్చు కూడా రూపాయి ఇవ్వమని తేల్చి చెబుతున్నారు. అధినేత ఏకగ్రీవం వద్దు అని చెప్పారు గనుక ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. గ్రామాల్లో కనీసం ప్రజలకు తెలియని కొంతమంది నేతలకు.. వైసిపి ఛాన్స్ ఇవ్వబోతుందన్నమాట.