AP Amaravati Development Plan: ప్రపంచంలో అగ్రగామి నగరంగా అమరావతిని( Amravati capital ) తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రపంచంలో దిగ్గజ నగరాల్లో ఒకటిగా చూపాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించారు. నవ నగరాలు నిర్మించాలన్నది ప్లాన్. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి విషయంలో కదలిక వచ్చింది. గత ఏడాది కాలంగా నిధుల సమీకరణ జరిగింది. ఇప్పుడు పనులు పట్టాలెక్కాయి. కేంద్ర ప్రభుత్వం సైతం తన ప్రాజెక్టులను ప్రారంభించింది. ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంకో వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం ఊపందుకుంది. అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్ లో నిర్మాణాలు జరిపేందుకు లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తుండడంతో.. వారు సైతం నిర్మాణాలు మొదలు పెట్టేందుకు నిర్ణయించారు. అయితే అమరావతిని కేవలం నిర్మాణ రంగంలోనే కాకుండా.. అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు కూడా నిర్ణయించింది.
Read More: అమరావతి టు రాయలసీమ.. ఆ ఐదు జిల్లాలకు గుడ్ న్యూస్!
అంతటా హరితవనాలు..
అమరావతి రాజధాని లో 6974 ఎకరాల్లో పార్కుల అభివృద్ధి, చెట్లు పెంచేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రధాన రహదారులతోపాటు ఎల్పీఎస్ లేఅవుట్లలోని రహదారుల పక్కన, రోడ్ల మధ్యలో, కాలువలు, చెరువుల ఒడ్డున పెద్ద ఎత్తున చెట్లు పెంచడంతోపాటు అమరావతి నవ నగరాల్లో నాలుగు ప్రధానమైన పార్కులను ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం.
* శాఖమూరులో 190 ఎకరాల్లో, మల్కాపురంలో 21 ఎకరాల్లో పబ్లిక్ రిక్రియేషన్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు.
* అనంతవరంలో 31 ఎకరాల్లో లాంగ్ స్పేస్ పార్క్, కురగల్లులో 200 ఎకరాల్లో జీవవైవిద్య పార్కు అభివృద్ధి చేయనున్నారు.
* రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్లలో 1602 ఎకరాల్లో 497 పార్కులు అభివృద్ధి చేయనున్నారు. ఉండవల్లి, నీరుకొండ, అనంతపురంలోని కొండలపై మొక్కలు కూడా పెంచనున్నారు.
30 శాతం పచ్చదనం..
అమరావతిలో 30% పచ్చదనం కనిపించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. మొత్తం రాజధాని లో 34 ప్రధాన రహదారులు ఉన్నాయి. వీటిలో చాలా రహదారుల వెంబడి మొత్తం ఎనిమిది వరుసలుగా చెట్లు పెంచబోతున్నారు. రహదారులకు రెండు వైపులా సైకిల్ ట్రాక్ లు, నడక మార్గాలు ఉండబోతున్నాయి. వాటి మధ్యలో ప్రధాన రహదారికి అటుమూడు వరుసలు, ఇటు మూడు వరుసలు, మధ్యలోని రెండు మీడియన్ లు కలిపి.. మొత్తం ఎనిమిది వరుసలుగా చెట్లు పెంచుతారు. దాదాపు ప్రతి రహదారిలో ఒక పార్కు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అయితే అమరావతిలో హరితమే కనిపించబోతుందన్నమాట.