Deputy CM Pawan Kalyan: మంగళగిరి : తనకు ఇష్టమైన శాఖలను దక్కించుకున్నారు పవన్. పల్లె సీమలు, అడవులు అంటే పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టం. అది చాలా సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు. అందుకే దానికి దగ్గరగా ఉన్న శాఖలు మాత్రమే తనకు ఇవ్వాలని కోరారు. అందుకు చంద్రబాబు కూడా అంగీకరించారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇలా బాధ్యతలు స్వీకరించారో లేదో పవన్ శాఖలపై దృష్టి సారించారు. పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీని స్వచ్ఛతా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో స్వచ్ఛతను ప్రోత్సహించేందుకు నిర్ణయించారు.
* జనసేన సిద్ధాంతానికి ప్రాధాన్యం..
జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణం ఒకటే. ఇప్పుడు దాని పైనే దృష్టి పెట్టారు పవన్. రోజురోజుకు పెరుగుతున్న వ్యర్ధాల కారణంగా.. పారిశుద్ధ్యం దారుణంగా క్షీణిస్తోంది. అందుకే వ్యర్ధాల నిర్వహణకు శాస్త్రీయ విధానంలో చేపట్టడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థలతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్, పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు పవన్. ప్రయోగాత్మకంగా పిఠాపురం తో పాటు భీమవరం నియోజకవర్గంలో చేపట్టాలని ఆదేశించారు. స్థానిక సంస్థలతోపాటు ప్రజలను చైతన్యవంతులను చేసి తమ గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ సూచించారు. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్ధాలను పునర్ వినియోగంలోకి తీసుకువచ్చే విధానాలను వారికి తెలియజేయాలన్నారు.
* సమూల మార్పులు..
వైసిపి ప్రభుత్వం క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ క్లాప్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి గ్రామంలో చెత్త సేకరణకు గ్రీన్ అంబాసిడర్లను సైతం నియమించారు. కానీ డంపింగ్ యార్డ్ సమస్యలతో ఈ చెత్త నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. పారిశుద్ధ్య క్షీణతకు, అనారోగ్య సమస్యలకు ఇదే కారణమని పవన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. ఈ తరుణంలో ప్రత్యేక కార్యాచరణ ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ జరగాలని పవన్ భావిస్తున్నారు. పర్యావరణం పై ఎక్కువ మక్కువ ఉన్న వారిని ఏకో వారియర్స్ గా ఎంపిక చేసుకొని భాగస్వాములు చేయాలని పవన్ సూచించారు. వ్యర్ధాల నిర్వహణ, డంపింగ్ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలను భాగస్వామ్యులను చేయాలని పవన్ సూచించారు. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాలు, చెరువులు, కాలువల వద్ద చెత్త వేయకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆరు నెలల్లో స్వచ్ఛతా రాష్ట్రంగా తీర్చిదిద్దే విషయంలో అధికారులకు కీలక సూచనలు చేశారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More