AP Weather Update: ఏపీలో ( Andhra Pradesh) భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఎండలతో పాటు వేడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. వేసవి తీవ్రత కొనసాగుతుండగా.. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ భిన్న వాతావరణం చూసి ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
* ఈరోజు పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లోని 9 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 49 మండలాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉంది.
* ఉపరితల ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం రికార్డు స్థాయిలో 45.8 సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇప్పటివరకు ఈ సీజన్లో ఇదే అత్యధికం. పలనాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2 డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందన మారేళ్లలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లాలో 28, కడప జిల్లాలో 26, తిరుపతి జిల్లాలో 25 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది.
* రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కూడా పడ్డాయి గురువారం. మార్కాపురం జిల్లా పొదిలిలో 37 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కలలో 22, నంద్యాల జిల్లా మెట్టుపల్లి లో 10.5m వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లాలో గురువారం సాయంత్రం వడగండ్ల వాన పడింది. తిరుమలలో కూడా గురువారం మధ్యాహ్నం 20 నిమిషాల పాటు వడగండ్ల వర్షం పడింది.