AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది. ఈ పరిస్థితుల్లో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో వాతావరణం లో మార్పులు కనిపించబోతున్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీచేసింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో నిలకడగా కొనసాగుతున్న తరుణంలో.. ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆకాశం మేఘవృతమై చల్లని వాతావరణం ఉంటోంది. ఈ ఏడాది ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించాయి. విస్తరణ జరిగిన ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఇప్పుడు మరోసారి రుతుపవనాల విస్తరణ సాగడంతో పాటు వర్ష సూచన రావడంతో రైతులు ఆశలు పెట్టుకున్నారు.
* మూడు రోజుల పాటు..
ఈరోజు నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణ, ఏలూరు, వైయస్సార్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తుంది.
* రాయలసీమకు సైతం..
రాయలసీమ జిల్లాలకు సైతం వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేయిస్తాయని చెబుతోంది. మరోవైపు వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని కూడా చెప్పుకొస్తోంది. దక్షిణ కోస్తా ప్రాంతంలో పొడి వాతావరణం తో పాటు చల్లని ఉపరితల గాలులు బలంగా వేస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్య చాన్స్ కనిపిస్తోంది. ఉరుములు ప్రారంభమైన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తుంది. చెట్ల కింద నిలబడటం మంచిది కాదని.. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. వర్షాలు పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తుంది. ఉరుములు మెరుపుల సమయంలో సెల్ఫోన్ ఆన్ చేయవద్దని సూచిస్తుంది. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు ఆశాజనకంగా పడతాయని.. ఖరీఫ్ పై ఆశలు చిగురిస్తున్నాయి రైతులకు..







