Visakhapatnam Data Centre: విశాఖలో గూగుల్ డేటా సెంటర్( Google data centre) నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఇది. దేశంలోనే భారీ పెట్టుబడితో నిర్మితం అవుతోంది ఈ ప్రాజెక్టు. సహజంగానే రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి ఇది మైలేజ్ ఇచ్చే ప్రాజెక్ట్. అయితే ఇక్కడే రాజకీయం చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి సాధారణ కార్యకర్త వరకు అదంతా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ క్రెడిట్ అంటూ ప్రచారం చేస్తోంది. పైగా అది గూగుల్ డేటా సెంటర్ కాదని.. అదాని డేటా సెంటర్ అంటూ చెబుతోంది. అయితే ఈ రకమైన ప్రచారంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన గందరగోళాన్ని సృష్టిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల అవగాహన ఉన్న వారికి మాత్రం గూగుల్ డేటా సెంటర్ రాక వెనుక ఎవరి కృషి ఉందో ఇట్టే తెలిసిపోతోంది. అది కేవలం చంద్రబాబు, లోకేష్ కృషి అని స్పష్టమౌతోంది. అయితే వారిద్దరికీ పేరు రావడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు.
* గత టిడిపి హయాంలోనే..
వాస్తవానికి 2019 ఫిబ్రవరిలో అదాని డేటా సెంటర్ నిర్మాణానికి అప్పటి సీఎం చంద్రబాబు( CM Chandrababu), అప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. దాదాపు 70 వేల కోట్ల రూపాయలతో అక్కడ డేటా సెంటర్ నిర్మాణానికి అదాని కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదాని కంపెనీకి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. పైగా టిడిపి ప్రభుత్వ నిర్ణయాలను పునసమీక్షిస్తూ చాలా రకాల పనులను రద్దు చేసింది. అలాగని ఈ డేటా సెంటర్ నిర్మాణ ప్రతిపాదనలు మార్చితే చూస్తాం అన్నట్టు జగన్ సర్కార్ చెప్పింది. దీంతో మూడేళ్ల తర్వాత అదాని కంపెనీ ప్రతిపాదనలు మార్చి అప్పటి జగన్ సర్కార్కు నివేదించింది. దీంతో జగన్మోహన్ రెడ్డి అదాని డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు 2023లో. కానీ ఒక్క పని కూడా అప్పట్లో జరగలేదు. అసలు డేటా సెంటర్ నిర్మాణం అనేది మరుగున పడిపోయింది.
* లోకేష్ చొరవ..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh)ఏకంగా గూగుల్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. అప్పటికే వివిధ రాష్ట్రాలు కూడా గూగుల్ సంస్థకు టచ్ లోకి వెళ్ళాయి. అయితే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తే రాయితీలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే డేటా పాలసీలో కొన్ని రకాల అడ్డంకులు ఏర్పడ్డాయి. వాటి విషయంలో నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వం డేటా పాలసీని అప్పట్లో మార్చారు. దీంతో గూగుల్ సంస్థ విశాఖకు వచ్చేందుకు సిద్ధపడింది. కానీ ఇదే గూగుల్ డేటా సెంటర్ ను అదాని డేటా సెంటర్గా చెబుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అది అసలు గూగుల్ కాదు అని.. అదాని డేటా సెంటర్ అని.. అది తెచ్చింది తామే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు.
* ఆసియాలోనే పెద్ద డేటా సెంటర్..
ఆసియాలోనే( Asia ) అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఇది. రెండు సంవత్సరాల్లో కార్యకలాపాలు సాగించే వీలుగా.. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అదాని సంస్థతో ఒప్పందం చేసుకుంది గూగుల్. మరోవైపు టెలికం రంగంలో నెట్వర్క్ పరంగా ముందంజలో ఉన్న ఎయిర్టెల్ సమస్యతో సైతం ఒప్పందం చేసుకుంది. ఆ రెండు సంస్థలు గూగుల్ కు భాగస్వామ్య సంస్థలు. అంతకుమించి ఏమీ కాదు. వాస్తవం ఇది కాగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేరేలా ప్రచారం చేసుకుంటోంది.