Zakia Wardak: ఆమె అత్యున్నత పదవిలో ఉన్న అధికారి. కానీ డబ్బు ఎవరికి చేదు అన్నట్లు.. ఆమె డబ్బు కోసం స్మగ్లర్గా మారింది. జీతం తీసుకుని చేసే ఉద్యోగంలో కిక్కేముంటుంది అనుకుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏకంగా 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. ముంబై ఎయిర్పోర్టులో జరిగిన ఈ ఘటన అధికారులను షాక్కు గురిచేసింది.
ఏం జరిగిందంటే..
భారత్లోని ఆఫ్గానిస్థాన్ కాన్సులేట్ జనరల్ జకియా వార్ధక్ స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఆమె ఏకంగా రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని భారత్కు అక్రమంగా తరలించేందుకు యత్నించింది. ఆమెను అడ్డుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ఈ ఘటన ముంబై ఎయిర్ పోర్టులో ఏప్రిల్ 25న జరుగగా, ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది.
పక్కా సమాచారంతో..
వార్ధక్ బంగారం స్మగ్లింగ్ చేస్తున్న అందిన పక్కా సమాచారం అందడంతో అధికారులు ముంబై విమానాశ్రయ సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబైకి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానెల్ నుంచి ఎయిర్ పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెను తనిఖీల నుంచి మినహాయింపు లభించింది. అయితే ఎయిర్పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా ఆమె వాటిని తోసి పుచ్చారు.
తనిఖీలతో గుట్టు రట్టు..
దీంతో అధికారులు మహిళా సిబ్బందితో వార్ధక్ను ఓ గదిలోకి తీసుకెళ్లి తనిఖీ చేయించారు. ఆమె ధరించిన జాకెట్, ప్యాంట్, మోకాలి క్యాప్, బెల్ట్లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆమె కుమారుడి వద్ద ఎలాంటి బంగారం లభించలేదు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు సమర్పించకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు..
అనంతరం ఈ ఘతనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్ట్ చేస్తారు. అయితే వార్ధక్కు దౌత్యపరమైన రక్షణ ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. దీనిపై స్పందించేందుకు వార్ధక్ నిరాకరించారు. తాను ముంబైలో లేనని, వచ్చాక స్పందిస్తానని పేర్కొన్నారు.