Begumpet Women: ఆ తల్లీకూతుళ్ళ తెగువకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. మొక్కవోని ధైర్యానికి జేజేలు పలకాల్సిందే. ధీరత్వానికి సలాం కొట్టాల్సిందే.. లేకపోతే ఓ దొంగల ముఠా కణత కు తుపాకీ గురి పెట్టి అలా బెదిరించిన. ఆడవాళ్ళు అని చూడకుండా దాడి చేసినా వారు వెరవలేదు. ఏ మాత్రం భయపడకుండా ఎదురుదాడికి దిగారు. దొంగలను తరిమి తరిమి కొట్టారు. హైదరాబాదులోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్ పూర జైన్ కాలనీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్ పూర జైన్ కాలనీలో నవరతన్ జైన్, ఆయన భార్య అమిత పైగా హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం అమిత, ఆమె కుమార్తె, పనిమనిషి ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో ప్రేమ్ చంద్, సుశీల్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కొరియర్ సర్వీస్ వచ్చిందంటూ నవరతన్ జైన్ ఇంటికి వచ్చారు. అయితే వారిద్దరిని బయటే ఉండాలని అమిత చెప్పింది. అయినప్పటికీ లెక్కపెట్టకుండా సుశీల్ కుమార్ హెల్మెట్ ధరించి ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్ళాడు. తన వెంట తెచ్చుకున్న బ్యాగులో తుపాకీని బయటికి తీసి అమితకు గురి పెట్టాడు. ఆ తర్వాత ప్రేమ్ చంద్ అనేరుగా వంటింట్లోకి వెళ్ళాడు. పనిమనిషి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే అమిత అత్యంత చాకచక్యంగా సుశీల్ ను కాళ్లతో తన్నింది. ఇదే క్రమంలో ఆమె కుమార్తె కూడా రావడంతో ఇద్దరూ కలిసి ఆ దొంగలను తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో సుశీల్ వారిద్దరిపై దాడి చేశాడు. ఆడవాళ్లు అని చూడకుండా ఎక్కడపడితే అక్కడ కొట్టాడు. అయినప్పటికీ వారు భయపడలేదు. గట్టిగా కేకలు వేస్తూ సుశీల్ కుమార్ ను పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు. ఆ గొడవ మొత్తం విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు ప్రేమ్ చంద్ కత్తితో బెదిరించడానికి ప్రయత్నించాడు. అక్కడనుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. స్థానికులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఈ లోపు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. ప్రేమ్ చంద్ ను పట్టుకున్నారు. సుశీల్ కుమార్ ను సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కాజీపేట లో జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమిత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ ఇద్దరు నిందితులు ఏడాది క్రితం అమిత ఇంటికి పని కోసం వచ్చారు. కొంతకాలం పనిచేశారు. అనంతరం మానేశారు. ఎక్కడెక్కడ ఇలాంటి వస్తువులు ఉంటాయో తెలుసుకొని.. పథకం ప్రకారం దోపిడికి పాల్పడేందుకు వచ్చారు. కాగా, అమిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దొంగలను ప్రతిఘటించిన తల్లీకూతుళ్ళ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వారి తెగువకు హాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Salute to these two #Hyderabadi #BraveWomen, fights with armed #Robbers .
Two armed men entered a house in #Begumpet, #Hyderabad and threatened the occupants with pistol.
A woman and her daughter shouted for Help and fought with the robbers, but they fled away. @hydcitypolice pic.twitter.com/vTQNmreVCJ— Surya Reddy (@jsuryareddy) March 21, 2024