Kurnool: అనుమానం పెనుభూతమైంది. ఒక వ్యక్తిని ఉన్మాదిలా మార్చింది. సొంత కుటుంబం పై విరుచుకుపడేలా చేసింది. ఈ ఘటనలో నాలుగేళ్ల కుమారుడిని బలి తీసుకోగా.. మనస్థాపంతో ఆ వ్యక్తి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
బనగానపల్లి మండలం పెదరాజు పల్లి గ్రామానికి చెందిన అరసాని రాజు(44) అనిత అనే మహిళను 14 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల దంపతులిద్దరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. దీంతో భార్య అనిత తన ఇద్దరు పిల్లలను తీసుకొని దేవనకొండలోని తల్లి దగ్గరకు వచ్చేసింది. ప్రైవేట్ టీచర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున రాజు దేవనకొండ వచ్చాడు. ఒక చేత్తో కత్తిని, మరో చేతితో పురుగుల మందు డబ్బాను పట్టుకుని హల్చల్ చేశాడు. భార్యను చంపేస్తానని బెదిరించాడు. దీంతో భార్య అనిత, పెద్ద కుమారుడిని తీసుకొని పారిపోయింది. ఆ సమయంలో చిన్న కుమారుడు ఉజ్వల్ (4) ఇంట్లో పడుకొని ఉన్నాడు. తీవ్ర కోపోద్రిక్తుడైన రాజు ఉజ్వల్ కు పురుగుమందు తాగించాడు. తాను కూడా తాగాడు. కలిసి ఉందామని తన భార్యను చెప్పినా వినకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు రాజు చెప్పాడు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని కన్నీరు మున్నీరయ్యాడు. అక్కడే కుప్ప కూలిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తండ్రీ, కుమారులు ఇద్దరూమృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More