Telugu New Newspaper: మీడియాలో మార్పులు సహజం. గట్టి ప్యాకేజీ లభిస్తే.. సమున్నతమైన స్థానం దక్కితే కచ్చితంగా పాత్రికేయులు స్థాన చలనం సిద్ధాంతాన్ని పాటిస్తూ ఉంటారు. ఇది తప్పేమీ కాదు. తప్పు పట్టాల్సిన అంశం కూడా కాదు. ఎందుకంటే ఎవరైనా సరే మెరుగైన భద్రత.. ఉత్తమమైన జీతాన్ని కోరుకుంటారు.
తెలుగులో అనేక రకాల మీడియా సంస్థలు ఉన్నాయి.. ఇందులో కొన్ని సంస్థలు మాత్రమే సక్రమంగా జీతాలు.. ఇతర సౌలభ్యాలను ఉద్యోగులకు అందిస్తున్నాయి.. రెగ్యులర్ స్ట్రీమింగ్ మీడియా హౌసెస్ ను పక్కన పెడితే.. ఆన్లైన్ విధానంలో సాగే మీడియా సంస్థలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఆన్లైన్ విధానంలో సాగే మీడియాకు ఓ పత్రిక నాంది పలికింది. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం మొదలైన ఆపత్రిక మీడియాలో సరికొత్త సంచలనం సృష్టించింది. న్యూస్ పేపర్ లో వచ్చే వార్తలు ఒకరోజు క్రితానివి అయి ఉంటాయి. అయితే ఈ పత్రిక మాత్రం ఎప్పటి వార్తలు అప్పుడు అన్నట్టుగా డైనమిక్ ఎడిషన్ లను ఇవ్వడం మొదలుపెట్టింది.
ఈ పత్రికలో పనిచేస్తున్న వారంతా ఎప్పటికప్పుడు వార్తలను అందించడం మొదలుపెట్టేవారు. అందులో వర్క్ కల్చర్ చాలా వింతగా ఉండేది. ఇంట్లో ఉండి పని చేయడం కావడంతో చాలామంది జర్నలిస్టులు ఆ వర్క్ కల్చర్ కు అలవాటు పడేవారు. ఎంత పని చేసినా వేతనంలో పెరుగుదల లేకపోవడంతో చాలామంది బయటకు వచ్చారు. ఆ సంస్థలో పనిచేసిన ఒక జర్నలిస్టు మాత్రం చాలా భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏ ఆన్లైన్ పత్రికలో అయితే అతను పని చేశాడో. అదే పత్రికకు పోటీగా నిలబడ్డాడు. ఆ పత్రికకు వినూత్నమైన పేరు పెట్టుకున్నాడు.
గతంలో ఆ పత్రికలో పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో.. వార్తలు విషయంలో అతడు అదే టెంపో సాగించడం ప్రారంభించాడు. ఫస్ట్ పేజీ లేఅవుట్.. మాస్టర్ హెడ్.. బ్యానర్.. సెకండ్ బ్యానర్.. ఇలా అన్ని అంశాలలో కొత్తదనాన్ని అతడు చూపిస్తున్నాడు. ఈ పత్రిక ద్వారా అతడు కొన్ని కుటుంబాలకు ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. వాస్తవానికి ఒక వ్యక్తి వ్యక్తి లాగా ఉండిపోతే కొత్తదనం ఉండదు. కానీ ఆ వ్యక్తి ఒక శక్తి లాగా మారితేనే అతని స్థాయి ప్రపంచానికి తెలుస్తుంది. ఈ జర్నలిస్ట్ కూడా సరికొత్త దిశలో ప్రయాణం సాగిస్తున్నాడు. శక్తులుగా మారే జర్నలిస్టులకు సరికొత్త తోవను చూపిస్తున్నాడు.
గతంలో సదరు జర్నలిస్టు పనిచేసిన పత్రికకు భారీగా ప్రకటనలు ఇచ్చాడు. పైగా ఇతడు తెలంగాణ రాజధానికి అత్యంత కీలకమైన జిల్లా బ్యూరో చీఫ్ గా పని చేశాడు. ప్రకటనల ద్వారా వచ్చిన డబ్బులను మేనేజ్మెంట్ కు అతడు చెల్లించలేదు. కోట్లల్లో బకాయిలు పేరుకుపోవడంతో.. మేనేజ్మెంట్ ఆయనను విధుల నుంచి తొలగించింది. ఇక అప్పటినుంచి అతడు ఎన్నారైలతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాదులోని ఓ ప్రాంతంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పేపర్ ఏర్పాటు చేశాడు. అందులో ఉన్న ఉద్యోగులు కూడా భారీగానే జీతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.