Hyderabad: హైదరాబాద్లోని మాంసం ప్రియులకు జీహెచ్ఎంసీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆదివారం మాంసం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మాంసం ప్రియులతోపాటు, సామాన్య ప్రజల ఇళ్లలో కూడా మాంసం వంటకాలు ఘుమఘుమలాడతాయి. చికెన్, మటన్తో వంటకాలు చేస్తారు. అయితే జీహెచ్ఎంసీ తాజాగా తీసుకున్న నిర్ణయం మాంసం ప్రియులకు మింగుడు పడడం లేదు.
ఆదివారం నీసు ఉండాల్సిందే..
వారం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పప్పులు ఇలా ఏం తిన్నా.. ఆదివారం వచ్చిందంటే దాదాపు 70 శాతం మంది ఇళ్లలో నీసు కూర ఉంటుంది. ఇదేంటంటే మేం తెలంగాణోళ్లం బై.. ఆదివారం గిట్లనే ఉంటది అంటారు. ముక్కలేనిదే ముద్ద దిగదు. అంతలా మాంసం అమ్మకాలు ఆదివారం జరుగుతాయి. మటన్, చికెన్, ఫిష్ ఇలా ఏదో ఒక వంటకం తప్పనిసరి ఉంటుంది. దీంతో సండే ఏ గల్లీకి వెళ్లినా మాంసం వంటకాలు నోరూరిస్తాయి. ఇక హైదరాబాద్ వాసులైతే.. ఆదివారం ఉదయమే చికెన్, మటన్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. ఫిష్ మార్కెట్లు కిటకిటలాడతాయి.
మాంసం దుకాణాలు బంద్..
అయితే తాజాగా జీహెచ్ఎంసీ ఆదివారం మాంసం దుకుణాలు బంద్ చేయాలని నిర్ణయించింది. వచ్చే ఆదివారం(ఏప్రిల్ 21న) జైనులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన మహావీర్ జయంతి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాంసం అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. మహావీర్ జయంతిని జైనులు ఎంతో పవిత్రంగా భావిస్తూ.. ఆరోజు ఎలాంటి జీవహింస చేయరు. మాంసాహారం ముట్టుకోరు. ఈ నేపథ్యంలో జైనుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ మటన్, చికెన్, బీఫ్ మార్కెట్లతోపాటు మాసం అమ్మే అన్ని షాపులు మూసివేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది.