Kalvakuntla Kavitha: కొడంగల్ లో 33 వేల అక్రమ ఓట్లు ఉన్నాయా.. కర్ణాటక ప్రజల ఓట్ల తోనే రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంలో గెలిచారా.. దీనికి ఎన్నికల సంఘం కూడా సహకరించిందా.. సరిగ్గా ఇవే మాటలు చెబుతున్నారు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత.. ఆమె చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారాయి. 2018 నుంచి 2023 వరకు కొడంగల్ లో మొత్తం 30 వేల కొత్త ఓట్లు చేర్చారని ఆమె ఆరోపించిన తీరు సరికొత్త చర్చకు దారితీస్తోంది.
కొడంగల్ నియోజకవర్గం లో 22 వేలకు పైగా నకిలీ ఓట్లు ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని కావిత ఆరోపించారు. అంతేకాదు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సడం నియోజకవర్గంలోని 11 వేల ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో నమోదయ్యాయని కవిత సరికొత్త విషయాన్ని తెరమీదికి తీసుకొచ్చారు. 33,000 ఓట్లు అక్రమంగా ఉన్నాయని.. రేవంత్ రెడ్డి ఏకంగా 32 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని కవిత ఆరోపించారు. “రేవంత్ గెలుపు వెనుక కర్ణాటక ఓటర్లు ఉన్నారు. అక్కడి నుంచి ఓటర్లను తీసుకువచ్చారు. అందువల్లే ఆయన గెలిచారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని ముందుగానే కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గెలవడానికి ఆయన అనేక అడ్డదారులు తొక్కుతున్నారు.. దీనికి ఎన్నికల సంఘం కూడా సహకరిస్తుందని” కవిత ఆరోపించారు.
కొడంగల్ నియోజకవర్గంలో 800 ఓట్లు మాత్రమే తొలగించారని.. బోధన్ నియోజకవర్గంలో ఏకంగా ఏడు వేల ఓట్లు తొలగించారని కవిత పేర్కొన్నారు. అంతేకాదు, దాదాపు లక్ష ఓట్ల వరకు కొడంగల్ నియోజకవర్గంలో మోడిఫికేషన్ జరిగిందని కవిత ఆరోపించారు. ఇవి సరికొత్త అనుమానాలకు తావిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు..”తెలంగాణ డబ్బులను కర్ణాటకకు పంపిస్తున్నారు. ఓటర్లను తీసుకొస్తున్నారు. చివరికి డబ్బుతో పాటు ఓట్లను కూడా బదిలీ చేశారు.. రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరించింది” అనే అనుమానాలు తమకు కలుగుతున్నాయని కవిత ఆరోపించడం విశేషం.
“ఓ నటుడికి మూడు రాష్ట్రాలలో ఓటు హక్కు ఉంది. ఆయన ఆ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనకు మూడు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని.. వాటిని తొలగించడానికి ఏడు సంవత్సరాలు పట్టిందని” కవిత ఆరోపించడం విశేషం. ఇటువంటి ఓటర్లను తొలగించకపోతే ఎస్ ఐ ఆర్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చి ఉపయోగం లేదని కవిత పేర్కొన్నారు.
