India Today Survey: తెలంగాణ పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. షెడ్యూల్ రావడంతో ప్రజలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరు, ఎవరికి ఓటేస్తే మంచిది అని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ ఒక్కటి మాత్రమే పూర్తిగా అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ 55 సీట్లకే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ నేడో రేపో అంటుంది. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై అనేక సర్వే ఫలితాలు వస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే ఒపీనియన్ పోల్తో సర్వే ఫలితాలు విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని ఆ సర్వే చెబుతుంది. తెలంగాణలో హంగ్ రావచ్చు అన్నట్లుగానే సర్వే ఫలితాలు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్కు 54 సీట్లు వస్తే, అధికార బీఆర్ఎస్కు 49 సీట్లు, బీజేపీకి 8 స్థానాలు దక్కుతాయని తెలిసింది. ఇతరులు ఎనిమిది స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.
ఎవరికీ మెజారిటీ రాదు..
ఈ సర్వే చూస్తే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సొంతంగా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. తెలంగాణలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. సింపుల్ మెజారిటీ అంటే సగానికి ఒక్క సీటు అదనంగా రావాలి. అలా చూస్తే అరవై సీట్లు వచ్చిన పార్టీదే అధికారం. సర్వేలో కాంగ్రెస్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినా 54 సీట్ల వద్దే ఆగిపోతోంది. ఈ హోరాహోరీ పోరులో బీఆర్ఎస్కు కూడా 49 సీట్లు వస్తాయని పేర్కొంది. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కేవలం మూడు సీట్లు మాత్రమే తేడా ఉంది. ఇక బీజేపీ సింగిల్ డిజిట్ దాటదని సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో రెండు సీట్లు వచ్చిన బీజేపీకి ఇపుడు నాలుగు రెట్లు సీట్లు పెరుగుతాయని అంచనా వేసింది. ఇక ఇతరులకు ఎనిమిది సీట్లు ఇచ్చారు. ఆ ఇతరులలో ఏడు సీట్లు మజ్లిస్ గెలుచుకుంటుంది అంటున్నారు.
రెండు పార్టీలు కలిసినా..
ఇండియా టుడే ఓపీనియన్ పోల్ సర్వ ప్రకారం.. ఎవరికీ మెజారిటీ రాని పరిస్థితులలో ఏ రెండు పార్టీలు కలసినా కూడా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా కనిపించడంలేదు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసినా 57 సీట్లకే పరిమితం అవుతారు. ఇక ఇతరులలో మజ్లిస్కి ఏడు సీట్లు వస్తాయనుకుంటే బీఆర్ఎస్, మజ్లిస్ కలిసినా మెజారిటీ రాదు అంటున్నారు. అదే మజ్లిస్ కాంగ్రెస్ తో కలిస్తే మాత్రం సింపుల్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అని అంటున్నారు.
అభ్యర్థుల ప్రకటన తర్వాత అంచనాలు మారే ఛాన్స్..
అయితే ఇండియా టుడే సర్వే ఫలితాలు మొదటి దశలో తీసుకున్నవే. ఇది మరింతగా ముందుకు సాగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత చేసిన సర్వే ఫలితాలు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించి జనంలోకి వెళ్లిన తరువాత ప్రచారం హోరు మరింతగా పెరిగిన తరువాత కచ్చితంగా మార్పు వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. నవంబర్ మొదటి, రెండో వారాల్లో వచ్చే ఒపీనియన్ పోల్ మాత్రం పూర్తి స్థాయిలో నిజమయ్యే ఛాన్స్ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైతే మొగ్గు కాంగ్రెస్ కే ఉందని అనేక సర్వేలు చెబుతున్నాయి. అదే టెంపో కొనసాగితే సింపుల్ మెజారిటీ కాంగ్రెస్ సాధించడం కష్టం కాబోదని సమాచారం. రాహుల్ గాంధీ అన్నట్లుగా సునామీ కనుక తెలంగాణలో ఉంటే కాంగ్రెస్కి అద్భుతం మెజారిటీ వచ్చినా ఆశ్చర్యం లేదు.