Hyderabad Rain: గ్రేటర్ హైదరాబాద్లో మంగళవారం(మే 7న) మండు వేసవిలో కుండపోత వర్షం కురిసింది. అప్పటి వరకు ఎండ వేడికి ఇబ్బంది పడిన నగర ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు. అయితే.. అ వెంటనే భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో రోడ్లు నదులను తలపించాయి. రెండు గంటలపాటు దంచికొట్టిన వానకు పలు ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్లు పేలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
4 నుంచి 8 సెం.మీల వర్షం..
గ్రేటర్ పరిధిలో మంగళవారం కనిష్టంగా 4 సెంటీమీటర్ల నుంచి 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వేడి నుంచి ఉపశమనం లభించినా వరదలతో రోడ్లు నరకాన్ని తలపించాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయింది. సరిగ్గా ఆఫీస్లు ముగిసే సమయానికి వర్షం కురవడంతో ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఐటీ కారిడార్లో భారీ వర్షంతో ట్రాఫిక్ సమస్యతో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. మెట్రో రైళ్లలో కూడా రద్దీ కనిపించింది. మరోవైపు వర్షంతో మెట్రో సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో మెట్రో స్టేసన్లలోఏ చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రయాణికుల రద్దీతో అధికారులు ఎస్కలేటర్లు, లిఫ్ట్లను ఆపేశారు.
కాలం ఏదైనా హైదరాబాద్ అంతే..
తెలంగాణలో ప్రభుత్వాలు మారుతున్న, కాలాలు మారుతున్నా.. వర్షం కురిసిందంటే చాలు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య కామన్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పాలకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిస్తే రోడ్లు , వీధులు జలమయం కావడం.. ట్రాఫిక్ జామ్ కావడం ఆనవాయితీగా వస్తోంది. రెండు గంటల వర్షానికే నగరం ఇలా మారిపోవడం పాలకుల పనితీరుకు అద్దం పడుతుందని నగర వాసలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.