Bandi Sanjay Son Case: ఎలా జరిగినా.. ఏం జరిగినా.. తప్పు తప్పే. దానిని సమర్థించకూడదు. ప్రోత్సహించకూడదు.. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఎవరైనా సరే అనుచితంగా.. దారుణంగా ప్రవర్తిస్తే ఆ తదుపరి పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళ మీద మరోసారి అటువంటి దారుణాలకు పాల్పడాలంటేనే మగవాళ్ళల్లో వణుకు పుట్టాలి. మన చట్టాలు, మన వ్యవస్థలు గొప్పవే అయినప్పటికీ.. అందులో ఉన్న లోపాలు కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా ఉంటున్నాయి. వాటిలో ఉన్న లోపాలను సాకులుగా చూపించుకొని ఆయా వ్యక్తులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజులుగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి వ్యవహారం విపరీతంగా చర్చలో ఉంది. ఒక అమ్మాయిపై అతడు దారుణంగా ప్రవర్తించాడని.. పేట్ బషీర్ బాదులో పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఈ కేసు నమోదైన కొద్ది రోజులకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. ఆ వేదిక మీద బండి సంజయ్ ఆవేశంగా మాట్లాడారు. తాను తప్పు చేయనని.. తప్పు చేసే అవకాశం కల్పించ బోనని స్పష్టం చేశారు. తద్వారా తన కుమారుడి మీద వస్తున్న ఆరోపణలకు బండి సంజయ్ పరోక్షంగా సమాధానం చెప్పారు.
వాస్తవానికి తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకుల కుమారులు.. వారితో సంబంధం ఉన్న వ్యక్తులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆ మధ్య భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు అత్యంత వేగంగా కారు నడిపి.. ఓ బాలుడి మరణానికి కారణమయ్యాడు. కొంతమందిని తీవ్రంగా గాయపరిచాడు. ఆ సమయంలో అతడు మద్యం తాగి ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఈ కేసులో పోలీసులను బురిడీ కొట్టించడానికి ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ప్రయత్నించాడు. రోడ్డు ప్రమాదం జరగగానే అక్కడి నుంచి పారిపోయిన ఎమ్మెల్యే కుమారుడు.. తన స్థానంలో మరొక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్టు నమ్మబలికాడు. చివరికి పోలీసులకు అన్ని ఆధారాలు దొరకడంతో అరెస్టు తప్పదని భావించిన అతడు దుబాయ్ పారిపోయాడు. తెలంగాణ పోలీసులు నోటీసుల మీద నోటీసులు జారీ చేయడంతో.. చివరికి అతడు దుబాయ్ నుంచి తెలంగాణకు వచ్చాడు. ఇటీవల కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరయ్యాడు.
భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూపాలపల్లి జిల్లా అడవుల్లో అడవి జంతువుల వేట సాగింది. ఈ జంతువులను వేటాడింది నాటి గులాబీ పార్టీ లో ఓ కీలక నాయకుడి మనవడు. అయితే ఈ వ్యవహారాన్ని బయటపడకుండా చూశారు. చివరికి మీడియా ద్వారా బయటపడడంతో కేసును నీరుగార్చారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణంలో అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు ఓ కుటుంబాన్ని వేధించాడు. దీంతో ఆ కుటుంబంలో ఉన్న నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల పుత్ర రత్నాల ఆగడాలు చాలానే ఉన్నాయి.
బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి కీలక ప్రకటన చేశారు. చర్యలు తీసుకునే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వం గనుక ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. అసలైన వారిపై చర్యలు తీసుకుంటే.. జన్మలో ప్రజాప్రతినిధుల కొడుకులు.. వారితో సంబంధం ఉన్న వ్యక్తులు ఇటువంటి వ్యవహారాలకు పాల్పడరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.